పవన్ కల్యాణ్ తో విడాకులు తీసుకుని తెగదెంపులు చేసుకున్నా.. రేణూదేశాయ్ మనసు మాత్రం తెలుగు గడ్డ చుట్టే పరిభ్రమమిస్తోంది. ఈ మహారాష్ట్ర మగువ.. ఇప్పుడు ఒక రియాలిటీ షోతో తెలుగు వాళ్లను పలకరించబోతోంది. ఇప్పటికే రేణూదేశాయ్ ట్విటర్లో చెప్పే కబుర్లు.. వార్తల్లోని అంశాలవుతున్నాయి. ఇప్పుడు టీవీ షోతో మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నారామె. స్టార్ మా నెట్ వర్క్ లో రేణూ ఒక షోకు జడ్జిగా వ్యవహరించబోతోందని కొన్నాళ్లుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అందుకు ధ్రువీకరణ లభించింది.
అందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది ఆ టీవీ చానల్ నెట్వర్క్. రేణూ కనిపించబోయే షో పేరు ‘నీతోనే డాన్స్’. దీనికి ఆమె జడ్జిలలో ఒకరిగా కనిపించబోతున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను కూడా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు జానీ మాస్టర్ కూడా ఒక జడ్జిగా వ్యవహరించబోతున్నారని తెలుస్తోంది. ఈ డ్యాన్స్ మాస్టర్ కు పవన్ కల్యాణ్ తో సన్నిహిత సంబంధాలున్నాయని అంటారు.
టైటిల్ ను బట్టి ఇది డ్యాన్స్ షో అని స్పష్టం అవుతోంది. మరి తెలుగునాట డ్యాన్స్ షోలకు ప్రత్యేక ఊపు ఉంది. ఇప్పటి వరకూ టెలివిజన్ తెరపై కొన్ని డ్యాన్స్ షోలు టాప్ టీఆర్పీలతో సాగాయి. ఈ నేపథ్యంలో రేణూదేశాయ్ జడ్జిగా వ్యవహరించబోతున్న షోగా దీనికి ప్రత్యేక గుర్తింపు దక్కుతోంది. మరి ప్రేక్షకులను ఇది ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.