లెజండరీ సింగర్ కె.జె.ఏసుదాస్ చాలా కాలం తర్వాత హైదరాబాద్లో లైవ్ కాన్సర్ట్ జనవరి 20న హైదరాబాద్ శిల్పకళావేదికలో జరగనుంది. ఈ సంగీత విభావరిలో ఏసుదాస్, విజయ్ ఏసుదాస్, కల్పన పాల్గొంటారు. కె.జె.ఏసుదాస్ మాట్లాడుతూ - నేను క్రిష్టియన్ ఫ్యామిలీలో పుట్టినా సంస్కృతంలోని అక్షరాలను నేర్చుకోమని అమ్మ చెప్పారు. అది ఆమె నాకు అందించిన ఆశీర్వాదం. మరో ఆశీర్వాదం ఏమిటంటే.. నేను ఐదేళ్ళ వయసులో ఉన్నప్పుడు చదువు గురించి ఎలాంటి బెంగా పెట్టుకోవద్దు. నార్మల్గా చదువుకుంటే చాలు. కానీ, కర్నాటిక్ క్లాసికల్ మ్యూజిక్ని బాగా నేర్చుకోమని చెప్పారు. నా పాటలు వినేవారు, సంగీత ప్రియుల ప్రార్థనల వల్లే నేను ఈ స్థాయికి వచ్చాను. అంతకుమించి మరేం లేదు. నేను దాదాపు 10 సంవత్సరాల తర్వాత హైదరాబాద్లో లైవ్ మ్యూజిక్ చేస్తున్నాను. మధ్యలో కొన్ని క్లాసికల్ పై దృష్టి సారించినా లైవ్ మ్యూజిక్ మాత్రం చాలా కాలం తర్వాత చేస్తున్నాను. నా బ్రదర్ అలేఖ్య హోమ్స్ శ్రీనాథ్ నన్ను లైవ్ మ్యూజిక్ చెయ్యమని చెప్పారు. హైదరాబాద్లో మళ్లీ ఈ కాన్సర్ట్ చెయ్యడం చాలా ఆనందంగా ఉంది. ఈ కాన్సర్ట్లో ప్రధానంగా తెలుగు పాటలు పాడతాము. అలాగే కొన్ని తమిళ్, హిందీ, మలయాళం పాటలు ఉంటాయి. మా నాన్నగారు చనిపోయేవరకు కూడా ఒక్కసారి కూడా నేను బాగా పాడుతున్నానని చెప్పలేదు. మన పిల్లల్ని మనమే అప్రిషియేట్ చెయ్యకూడదు. వాళ్ళకు వాళ్ళు ఎదగాలి. మా అబ్బాయి విజయ్ కూడా పాటలు పాడుతున్నాడు. ఇప్పుడొస్తున్న సింగర్స్ చాలా మంది బాగా పాడుతున్నారు. ఇప్పుడు సౌకర్యాలు బాగా పెరిగాయి. ఆరోజుల్లో నేను, సుశీల డ్యూయట్ పాడితే ఒకే మైక్లో ఒకరి తర్వాత ఒకరం పాడేవాళ్లం. కానీ, ఇప్పుడలా కాదు. డిఫరెంట్ ట్రాక్స్ వచ్చేసాయి” అని అన్నారు.