మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, నట సింహం బాలక్రిష్ణ, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఒకే వేదిక సందడి చేశారు. టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యుసర్ టి. సుబ్బరామిరెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఏటా నిర్వహించే ‘టీఎస్ఆర్ నేషనల్ అవార్డ్స్’ ప్రదానోత్సవ కార్యక్రమం విశాఖలో ఆదివారం నాడు అంగరంగ వైభవంగా సాగింది. ఈ వేడుకకు టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్లను సినీ ప్రముఖులు హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, బాలక్రిష్ణ, అక్కినేని నాగార్జున, మోహన్ బాబు, రాజేంద్రప్రసాద్, విశాల్, బోనీ కపూర్, విద్యాబాలన్, ఖుష్బూ, రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు హాజరయ్యారు.
గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రంకు గాను బాలకృష్ణ అవార్డును అందుకోవడం జరిగింది. ఈ సందర్బంగా బాలకృష్ణ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.తాజాగా జరిగిన పుల్వామ ఉగ్ర దాడిలో అమరులైన వీర జవాన్ లకు శ్రద్దాంజలి ఘటించిన బాలకృష్ణ ఆ తర్వాత మాట్లాడుతూ.. దేశాన్ని కంటికి రెప్పలా కాపాడే సైనికులు ఉగ్రవాదుల దుశ్చర్యలకు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్ ల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లుగా బాలకృష్ణ అన్నాడు.
ప్రతి సంవత్సరం టీఎస్సార్ ఇలా సినీ కళాకారులకు అవార్డులు ఇస్తూ ప్రోత్సహించడం మంచి పరిణామం అని గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రంలో తాను పోషించిన పాత్రకు ఈ అవార్డు రావడం తనకు మరింత సంతోషాన్ని కలిగించినట్లుగా చెప్పుకొచ్చాడు. నాన్నగారు చేయలేని ఆ పాత్ర చేసినందుకు తాను ఎప్పటికి మర్చి పోలేను అన్నాడు.
ప్రస్తుతం దేశంలో పరిస్థితి ఎలా ఉందో మనం చూస్తూనే ఉన్నాం. అప్పట్లోనే విదేశీయులు భారత దేశాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించగా విదేశీయులకు ఎదురు వెళ్లి మరీ పోరాడిన ఘనత గౌతమి పుత్ర శాతకర్ణికే దక్కుతుందని బాలయ్య అన్నారు. బాలయ్య దేశ భక్తి అమర జవాన్ ల గురించి మాట్లాడటంతో సోషల్ మీడియాలో ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి.