‘మనం’.. ‘సోగ్గాడే చిన్నినాయనా’.. ‘ఊపిరి’ సినిమాలతో హ్యాట్రిక్ హిట్టు కొట్టి మాంచి ఊపు మీద కనిపించాడు అక్కినేని నాగార్జున. కానీ ఆ తర్వాత ఆయన నుంచి వచ్చిన సినిమాలన్నీ దారుణ పరాజయాల్ని మూటగట్టుకున్నాయి. ‘నమో వేంకటేశాయ’.. ‘ఆఫీసర్’ లాంటి భారీ డిజాస్టర్లు ఎదుర్కొన్నాడు నాగ్. ఎంతో పాజిటివిటీ మధ్య రిలీజైన ‘దేవదాస్’ కూడా నిరాశ పరచడంతో నాగార్జున కెరీర్ నెమ్మదించింది. అంతర్మథనంలో పడ్డ నాగ్.. కొత్త సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేశాడు. వెంటనే హీరోగా తెలుగులో ఏ సినిమా ఒప్పుకోలేదు. కానీ హిందీ, తమిళం, మలయాళ భాషల్లో ప్రత్యేక పాత్రలు చేయడానికి అంగీకరించాడు.
హిందీలో కరణ్ జోహార్ ప్రొడక్షన్లో తెరకెక్కుతున్న మెగా మూవీ ‘బ్రహ్మాస్త్ర’లో ఓ కీలక పాత్రకు ఓకే చెప్పి షూటింగులో కూడా పాల్గొన్నాడు నాగ్. మరోవైపు తమిళంలో ధనుష్ దర్శకత్వంలోో ‘రుద్ర’.. మలయాళంలో ప్రియదర్శన్-మోహన్ లాల్ కాంబినేషన్లో మొదలైన ‘మరక్కార్’ చిత్రాల్లో నాగ్ ప్రత్యేక పాత్రలు ఓకే చేసినట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.
కానీ ధనుష్ సినిమా బడ్జెట్, ఇతర సమస్యల వల్ల ఆగిపోయింది. ‘మరక్కార్’ మాత్రం రెండు నెలల కిందటే పట్టాలెక్కడంతో నాగ్ ఆ చిత్రంలో నటిస్తున్నాడనే అంతా అనుకున్నారు. కానీ చకచకా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నాగ్ భాగమైనట్లుగా ఏ అప్ డేట్ లేదు. సినిమా సెట్స్ నుంచి ఎప్పటికప్పుడు ఫొటోలు బయటికి వస్తున్నాయి. అందులో నాగ్ లేడు.
తాజాగా ఉగ్రదాడిలో మరణించిన జవాన్లకు నివాళి అర్పిస్తున్న ‘మరక్కార్’ టీం ఫొటో బయటికి వచ్చింది. అందులో మోహన్ లాల్తో పాటు అర్జున్, అశోక్ సెల్వన్ సహా నటీనటులందరూ కనిపిస్తున్నారు. నాగ్ మాత్రం లేడు. మరి ఈ సినిమాలో నాగ్ చేయట్లేదా.. లేక ఆయన పాత్రకు సంబంధించిన షూటింగ్ ఇంకా మొదలు కాలేదా అన్నది అర్థం కావడం లేదు. ఇక తెలుగులో నాగ్ హీరోగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ‘మన్మథుడు-2’ త్వరలోనే మొదలు కానున్న సంగతి తెలిసిందే.