నిన్నంతా ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మధ్య 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రంపై తీవ్ర వాదోపవాదాలు జరిగిన సంగతి తెలిసిందే. తిరిగి ఈ ఉదయం 8.15 గంటల సమయంలో రామ్ గోపాల్ వర్మ తన ఫేస్ బుక్ ఖాతాలో ఇదే విషయంపై స్పందించాడు."మై రిప్లైస్ టు ది గ్రేట్ ఆనరబుల్ టీడీపీ అగ్రికల్చర్ మినిస్టర్ 'మర్యాద తిమ్మన్న' సోమిరెడ్డి గారి కామెంట్స్ కు" అంటూ వ్యంగ్యాస్త్రాలు విడిచారు. సోమిరెడ్డి వ్యాఖ్యలను ఒక్కొక్కటిగా ప్రస్తావిస్తూ, వాటికి తన సమాధానాలు చెప్పాడు.
"ఎన్టీఆర్ జీవిత చరిత్ర సినిమాలో నన్ను తనను హీరోగా చేయమని రాంగోపాల్ వర్మ అడగడం సంతోషం. నేను హీరోగా చేయాలంటే హీరోయిన్ గా లక్ష్మీ పార్వతిని మార్చాలి" అన్న సోమిరెడ్డి వ్యాఖ్యకు, "సార్ మీరు హీరోయిన్ గా లక్ష్మి పార్వతి గారిని వద్దు అని చెప్పినప్పట్నుంచి దీపికా పదుకొనే నుండి మీ అగ్రికల్చర్ పొలాలలో పని చేసే స్త్రీ కూలీలదాకా అందర్నీ అడిగి చూసా. వాళ్ళ రిప్లైలు వింటే మీరు ఉరేసుకుంటారు. కాబట్టి మానవతా దృక్పధం కన్నా మీ భార్య గారి మీద గౌరవంతో వాళ్ళు మీ పైన వ్యక్తపరిచిన అభిప్రాయాలు అన్నింటిని నా మనసులోనే అతి భద్రంగా దాచిపెడ్తున్నా" అన్నాడు.
ఇక "లక్ష్మి పార్వతి గారంటే నాకు చాలా గౌరవం ఉంది . అందుకే ఆమె హీరోయిన్ గా వద్దు అంటున్నా" అని సోమిరెడ్డి అన్నందుకు, "అంటే హీరోయిన్లు గౌరవానికి అనర్హులనా? మినిస్టర్ గారూ... హీరోయిన్లపై మీ ఈ ఇన్సల్టింగ్ కామెంట్ పైన దీపికా పదుకొనె, సమంత, కత్రినా కైఫ్, ఇలియానా, ప్రియాంక చోప్రా వగైరా హీరోయిన్ల రియాక్షన్లను మీడియా వెంటనే తీసుకోకపోతే వాళ్ళు కూడా మీ అంత అతి......... దీని అర్థం చెప్పను. ఎందుకులే, ఎంత చెడ్డా మీరు మినిస్టర్ గా!" అన్నాడు.
"ఎన్టీఆర్ గురించి నాకు తెలిసినంతగా రామ్ గోపాల్ వర్మకు తెలియదు" అన్న సోమిరెడ్డి వ్యాఖ్యలపై "మై డియర్ సోమి, ఇక్కడ ప్రశ్న నాకెంత తెలుసని కాదు. తెలిసేంత బుర్ర నీకు ఉందా అని" అని సెటైర్ వేశాడు. రాజకీయ ఉద్దేశాలతోనే ఈ సినిమాను ఎన్నికల ముందు తీస్తున్నారని సోమిరెడ్డి ఆరోపించినందుకు, రాజకీయ ఉద్దేశాలు ఏమి లేకుండానే రాజకీయ నాయకుడివి అయ్యావా? అయితే నీ 'ఎన్'కి ఓ నమస్కారం. ఎన్- అంటే తప్పనుకోవద్దు. ఎన్ అంటే నోరు అన్నాడు ఆర్జీవీ.