ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రంభ, రాశిల యాడ్స్‌ను తొలగించండి.. కోర్టు తీర్పు

cinema |  Suryaa Desk  | Published : Fri, Feb 22, 2019, 08:31 PM



మీరు లావుగా వున్నారని చింత అసలే వద్దు. మా దగ్గరకు వస్తే మీరు మల్లె తీగలా తయారవుతారు. అందుకు మాది గ్యారెంటీ.. అంటూ వివిధ టీవీ ఛానళ్లలో యాడ్స్ ఊదరగొడుతుంటాయి. ఆ యాడ్స్‌లో ప్రముఖ సినీ తారల ఫోటోలు వాడుకుంటారు. బిఫోర్, ఆఫ్టర్ అంటూ వారు వీరి క్లినిక్‌కు రాకమునుపు ఇలా లావుగా వుండేవారని, వచ్చాక ఇలా సన్నగా, నాజూగ్గా తయారయ్యారని చెబుతుంటారు. అవన్నీ చూసి నిజమని నమ్మి చాలామంది ఆ క్లినిక్‌లకు వెళ్లి డబ్బులు దుబారా చేస్తుంటారు. అలా మోసపోయిన ఓ వినియోగదారుడు ఫిర్యాదు చేయగా, విజయవాడ వినియోగదారుల ఫోరమ్ కోర్టు ఆ యాడ్స్‌లో సినీ తారల ఫోటోలను తొలగించాలని తీర్పిచ్చింది.
వివరాల్లోకి వెళ్తే..కలర్స్ అనే సంస్థ సీనియర్ హీరోయిన్లు రాశి, రంభల ఫోటోలతో ప్రసార మాద్యమాల్లో ప్రకటనలు ఇస్తున్నారు. లావుగా వున్న రాశి, రంభలు తమ క్లినిక్‌కు వచ్చాక స్లిమ్ అయ్యారని ఆ యాడ్స్‌లో చెబుతున్నారు. ఈ ప్రకటనలు చూసి మోసపోయిన ఓ వినియోగదారు వినియోగదారుల ఫోరమ్ కోర్టులో ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదుపై విచారణ జరిపిన జస్టిస్‌ మాధవరావు.. కలర్స్ సంస్థకు వినియోగదారుడు చెల్లించిన రూ.74,652ల మొత్తాన్ని 9 శాతం వడ్డీతో  వెంటనే చెల్లించాలని సూచించారు. అలాగే వినియోగదారుల సంక్షేమ నిధికి రూ. 2 లక్షలను జరిమానాగా చెల్లించాలని, వెంటనే రాశి, రంభల ప్రకటనలను ఆపేయాలని తీర్పునిచ్చారు.
సినీరంగంలో మంచి పేరున్న నటీమణులైన రంభ, రాశి ఇలాంటి తప్పుడు ప్రకటనలను ప్రోత్సహించడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఇక మీదట ఇటువంటి ప్రకటనల పట్ల సినీతారలు జాగ్రత్త వహించని పక్షంలో కొత్త చట్టం ద్వారా సెలబ్రిటీలకు కూడా జరిమానా విధిస్తామని తెలిపారు. ఇదిలావుండగా అక్రమంగా పార్కింగ్‌ రుసుము వసూలు చేస్తున్న పీవీఆర్‌ మాల్‌కు రూ. 5 లక్షల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. హైకోర్ట్ ఉత్తర్వుల ప్రకారం మాల్స్, మల్టిప్లెక్స్‌లలో ఉచిత పార్కింగ్ కల్పించేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమీషనర్, కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్‌కు ఆదేశాలు జారీచేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com