భారతీయ జనతా పార్టీ నేత జీవీఎల్ నరసింహారావుపై సినీ హీరో మంచు విష్ణు మండి పడ్డాడు. ట్విటర్ వేదికగా బీజేపీ అధికార ప్రతినిధిపై విష్ణు విమర్శల వర్షం కురిపించారు. సినీనటులపై కు కనీస అవగాహన ఉండదు, వారికి విషయ పరిజ్ఞానం ఉండదు.. అని నరసింహారావు చేసిన వ్యాఖ్యలపై విష్ణు స్పందించాడు. సినీనటులను కించపరిచే వ్యాఖ్యలు చేశారని విష్ణు బీజేపీ నేతపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఇటీవల విడుదల అయిన తమిళ సినిమా ‘మెర్సల్’ వివాదంలో బీజేపీ నేతలు గట్టిగా స్పందిస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమాలో జీఎస్టీ, డిజిటల్ ఇండియాలను తప్పుపట్టారని తమిళనాడు బీజేపీ నేతలు మొదలుపెట్టారు. దాన్నే ఏపీ బీజేపీ నేతలు కూడా అందుకున్నారు. అవే మాటలనే జీవీఎల్ అందుకున్నారు. సినిమా వాళ్లకు విషయావగాహన ఉండదని వ్యాఖ్యానించారు. ఈ మాటలు ఇప్పుడు వివాదం అవుతున్నాయి.
ఈ నేపథ్యంలో విష్ణు స్పందించాడు. ‘సినిమా వాళ్లకు ఐక్యూ, జీకే లు ఉండవు అనేస్తున్నారు.. మరి రాజకీయ నేతలు అంతా అవినీతిపరులు అయినట్టేనా? చాలా మంది గొప్ప రాజకీయ నేతలు సినీ రంగం నుంచి వచ్చారని మరిచిపోవద్దు. శ్రీ ఎన్టీఆర్, శ్రీ ఎంజీఆర్, శ్రీ జయలలిత వంటి వారు సినిమా వాళ్లు కాదా? ఎవరైనా తమ అభిప్రాయాన్ని చెప్పడానికి గొప్ప ఐక్యూ, గొప్ప జీకే ఉండాల్సిన అవసరం లేదు. నా మాటలను రాజకీయం అనుకోవద్దు. నేను బీజేపీని గౌరవిస్తా, ప్రధాని మోడీకి పెద్ద అభిమానిని..’ అని విష్ణు ట్వీట్ చేశాడు.