బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బాటలోనే.. టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి అడుగులు వేస్తున్నారా...? ఏ విషయంలో అంటారా...?! రాజకీయాలే...! రాజకీయాలంటేనే అదొక మాయాప్రపంచం. ఆనాడు అమితాబ్ బచ్చన్, ఈనాడు చిరంజీవి అనుభవంలోకి వచ్చిన చేదు వాస్తవాలివి. తెలుగు రాష్ట్రాల్లో మొన్నటి ఎన్నికల వేళ, హైదరాబాదుకు రాహుల్ గాంధీ వచ్చారు. చిరును ప్రచారానికి ఆహ్వానించారు. ఒకప్పటి ఆయన హీరోయిన్ విజయశాంతి కూడా రావాలని ఆహ్వానించారట. ఇక్కడి కాంగ్రెస్ పెద్దలు కూడా ప్రయత్నించారట. ఇక, జన సైనికులైతే- ‘సై.. సైసై‘ అంటూ, తొడ కొడుతూ అన్న ‘సైరా’ వస్తాడేమోనని ఎదురుచూశారు. కోడలు ఉపాసనకు చుట్టమైన చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా చిరును తన ప్రచారానికి ఆహ్వానించారు. ఇలా ఎందరెందరో... ఎంతగా అడిగినా చిరు కదల్లేదు. ప్రచారానికి వెళ్లలేదు. కనీసంగా, ఏ ఒక్కరికి మద్దతుగా కూడా నోరు విప్పలేదు. చివరికి, తన ఇద్దరు తమ్ముళ్లకు నోటి మాటగానైనా మద్దతు తెలపలేదు. అమితాబ్ కూడా అంతే. తనకు సన్నిహిత స్నేహితుడైన రాజీవ్ గాంధీ కోరిక మేరకు 90వ దశకంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అందులోకి వెళ్లాక ఆయన అనేక అవమానాలు ఎదుర్కొన్నారు. తన ఒంటికి రాజకీయాలు సరిపడవని నిశ్చితాభిప్రాయానికొచ్చారు. అంతే... రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. ఆ తరువాత ఆయన రాజకీయాల వైపు కన్నెత్తి చూడలేదు. ఆయన భార్య జయాబచ్చన్ మాత్రం, సమాజ్ వాదీ పార్టీ నుంచి ఎంపీగా గెలిచారు. ఆ కుటుంబంలో ఆమె ఒక్కరే రాజకీయాల్లో ఉన్నారు. అమితాబ్ బాటలోనే చిరు కూడా నడుస్తున్నారు. కారణాలు ఏవైనా కానివ్వండి, ఈయన కూడా రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. సినిమాల పైనే చూపు కేంద్రీకరించారు. ఆయన కుటుంబం నుంచి ఇద్దరు తమ్ముళ్లు రాజకీయాల్లో కొనసాగుతున్నారు. అమితాబ్ బాటలో... చిరు ‘స్టెప్స్’ పడుతున్నాయి. అక్కడ అమితాబ్, ఇక్కడ చిరు... వెండి తెరపై అలరిస్తున్నారు.