ఒకప్పుడు టాలీవుడ్లో హీరో సిద్ధార్థ్కు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా ఉండేది. కానీ రాను రాను తెలుగులో అవకాశాలు తగ్గిపోవడంతో ఆయన కోలీవుడ్కు వెళ్లిపోయాడు. చాలా కాలం తరువాత ఆయన నటించిన హారర్ సినిమా ‘గృహం’ తెలుగులో విడుదలకు సిద్ధమైంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకే రోజు నవంబర్ 3న సినిమా విడుదల చేయాలని మొదట అనుకున్నారు. సిద్ధార్థ్ తెలుగు సినిమా ప్రమోషన్స్లో కూడా పాల్గొన్నాడు. ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తి పెంచాయి. అయితే ముందుగా ప్రకటించినట్లు శుక్రవారం ఈ సినిమా విడుదల కావడంలేదు.
తమిళ, హిందీ భాషల్లో మాత్రం ఈ సినిమా రేపే విడుదలవుతుంది. దీంతో అక్కడ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా గడుపుతున్నాడు సిద్ధార్థ్. కానీ తెలుగులో మాత్రం ఆశించిన థియేటర్లు దొరకకపోవడంతో సినిమా రిలీజ్ను ఆపాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిజానికి రెండు వారాల క్రితం వచ్చిన ‘రాజా ది గ్రేట్’.. అలానే గత వారం విడుదలైన ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ సినిమాలకు బ్యాక్గ్రౌండ్ బలంగా ఉండడంతో వాటిని ఈ వారం కూడా థియేటర్లలలో కొనసాగిస్తున్నారు.
దీంతో ఈ శుక్రవారం రాబోతున్న ‘గరుడ వేగ’, ‘నెక్స్ట్ నువ్వే’, ‘ఏంజెల్’ సినిమాలకు థియేటర్లు దొరకడమే కష్టమైపోయింది. అనుకున్న థియేటర్లు దొరకలేదని ఇప్పటికే ఈ మూడు సినిమాల మేకర్లు నిరుత్సాహాంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో సిద్ధు ‘గృహం’ డబ్బింగ్ సినిమా కావడంతో చాలా తక్కువ థియేటర్లు ఇచ్చారట. దీంతో సిద్ధు ఈ శుక్రవారం విడుదల ను ఆపేశాడు. నవంబర్ 10న సినిమాను విడుదల చేయాలని నిర్ణయించుకున్నాడు.