దసరాకు ‘మహానుభావుడు’తో హిట్టు కొట్టి మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కిన యువ కథానాయకుడు శర్వానంద్.. తన కొత్త సినిమాకు రంగం సిద్ధం చేసుకున్నాడు. ‘స్వామి రారా’.. ‘దోచేయ్’.. ‘కేశవ’ చిత్రాల దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో అతడి సినిమా మొదలు కానుంది. ఈ చిత్రానికి హీరోయిన్ల వేట పూర్తయింది.అతడి సరసన ఇద్దరు పొట్టి హీరోయిన్లు నటించబోతున్నారు. ‘జెంటిల్మన్’, ‘నిన్ను కోరి’ సినిమాలతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న నివేదా థామస్తో పాటు ‘అర్జున్ రెడ్డి’తో రాత్రికి రాత్రే సూపర్ పాపులారిటీ సంపాదించుకున్న షాలినీ పాండే కథానాయికలుగా నటించనున్నారు.
ఈ సినిమా కోసం ఓ కథానాయికగా కాజల్ అగర్వాల్ను అడిగినట్లుగా వార్తలొచ్చాయి. కానీ పారితోషకం విషయంలో ఆమె బెట్టు చేయడంతో ఆల్టర్నేట్ చూశారట. వేరే హీరోయిన్లను కూడా పరిశీలించి చివరికి నివేదా, షాలినిలను ఫైనలైజ్ చేశారు. హీరో హీరోయిన్లు ముగ్గురూ మంచి నటులుగా గుర్తింపు తెచ్చుకున్న నేపథ్యంలో వీరి కాంబోలో రాబోయే సినిమా ఎలా ఉంటుందన్నది ఆసక్తికరం.
ఈ చిత్రాన్ని హారిక, హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మించనుంది. మొదట్నుంచి త్రివిక్రమ్ దర్శకత్వంలోనే సినిమాలు చేస్తున్న రాధాకృష్ణ తొలిసారి వేరే దర్శకుడితో చేయబోతున్న సినిమా ఇదే. ఆయన ప్రస్తుతం పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ సినిమాను నిర్మిస్తున్నారు. ఆయనకే చెందిన సితార ఎంటర్టైన్మెంట్స్ మారుతి-నాగచైతన్య సినిమాను ప్రొడ్యూస్ చేయనుంది.