ముంబయి: బాలీవుడ్ కథానాయిక అనుష్క శర్మ తన సినిమా సెట్లో ఉన్న మహిళలకు కానుకలు ఇచ్చి సర్ప్రైజ్ చేశారు. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో వస్తున్న చిత్రంలో అనుష్క కథానాయికగా నటిస్తోంది. ఆమెతో పాటు షారుఖ్ఖాన్, కత్రినా కైఫ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో నటిస్తున్న మహిళలకు అనుష్క తన దుస్తుల సంస్థ ‘నుష్’ నుంచి ట్రెండీ దుస్తులను తెప్పించి ఇచ్చారట. దీంతో టీంలోని మహిళలు చాలా సంతోషించినట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం.
సినిమా షూటింగ్ విరామ సమయంలో అనుష్క మిగిలిన సభ్యులతో చాలా సరదాగా మాట్లాడుతుంటారని చిత్ర బృందం పేర్కొంది. వారితో బంధం పెంచుకుని ఇష్టాయిష్టాలను కూడా తెలుసుకున్నారని చెప్పింది. ఈ మేరకు ఆమె ఎవరికి నచ్చిన వస్తువులు వారికిచ్చారట.
‘జబ్ హ్యారీ మెట్ సెజల్’ చిత్రంతో ఇటీవల అనుష్క ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ప్రస్తుతం ఆమె ‘సూయీ ధాగా’, ‘పరి’ చిత్రాల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.