దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఎంత విజయవంతమయినా, ఇక్కడ ఎన్ని కోట్లు గడిస్తున్నా కానీ బాలీవుడ్లో పాపులర్ అయి దేశమంతా తమని గుర్తించాలని కోరుకుంటారు హీరోయిన్లు. అందుకే తొంభై శాతం సక్సెస్ఫుల్ సౌత్ హీరోయిన్లు బాలీవుడ్ కెరియర్పై మక్కువ చూపిస్తారు. అక్కడ కూడా అదృష్టం కలిసి వచ్చి స్టార్స్ అయిపోతామేమో అని ఒక రాయి వేసి చూస్తారు.
అయితే ఈ క్రమంలో ఇక్కడ కొన్ని అవకాశాలు వదిలేసుకుంటారు. ఈలోగా ఇక్కడ వేరే హీరోయిన్లు తమ స్థానాన్ని తీసేసుకుంటారు. అక్కడ అదృష్టం కలిసి రాలేదని తిరిగి ఇక్కడకు వచ్చేసరికి మునుపటి ఆదరణ కోల్పోతుంటారు. ఇలా ఎంతో మంది హీరోయిన్లు తప్పటడుగులు వేసి కెరియర్కి సడన్ బ్రేకులు వేసుకున్నారు. ఇటీవలి కాలంలో అయితే ఇలియానా, తమన్నా, శృతిహాసన్ తదితరులు ఈ కోవకే చెందుతారు.
ఇదంతా చూస్తూ కూడా తెలుగు చిత్ర సీమలో ఇప్పుడు తనకున్న పాపులారిటీని ఖాతరు చేయకుండా బాలీవుడ్ అవకాశాల కోసం చూస్తోంది పూజా హెగ్డే. హిందీలో ఒక మల్టిపుల్ సినిమా డీల్ ఒప్పుకుని ఇక్కడ కొన్ని పెద్ద సినిమాలు మిస్ అయ్యే పరిస్థితిని కొని తెచ్చుకుంది. రష్మిక, కీర్తి సురేష్ లాంటి హీరోయిన్లకి ఫుల్ డిమాండ్ వున్న నేపథ్యంలో పూజ ఇప్పుడు టాలీవుడ్కే పరిమితమైతే బెస్ట్ అనేది విశ్లేషకుల అడ్వయిస్.