రచయితగా .. దర్శకుడిగా .. నటుడిగా పోసాని తన ప్రత్యేకతను చాటుకున్నారు. కొంతకాలంగా ఆయన నటనపైనే పూర్తి దృష్టి పెట్టారు. కమెడియన్ గా తనదైన ముద్రతో ప్రేక్షకులను మెప్పిస్తూ బిజీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఎన్నికల సమయంలో ఆయన వైసీపీకి తన మద్దతు తెలియజేస్తూ మాట్లాడారు. కొన్ని సందర్భాల్లో టీడీపీ నాయకులపై విమర్శలను గుప్పించారు.
తాజాగా ఆయన మాట్లాడుతూ .. "ఎన్నికలు పూర్తయిన దగ్గర నుంచి నాకు పెద్దగా అవకాశాలు రావడం లేదు. నేను వైసీపీకి మద్దతుగా నిలవడం వల్లనే అవకాశాలు రావడం లేదనే విషయం నాకు అర్థమైపోయింది. ఇటీవల ఒక పెద్ద సినిమా నుంచి నాకు రావలసిన అవకాశానికి కొంతమంది అడ్డుపడ్డారని తెలిసింది. అలా చేసింది ఎవరనే విషయం కూడా నాకు తెలుసు" అని అన్నారు. చిత్రపరిశ్రమను ఏపీకి తరలించే ప్రయత్నం కూడా మంచిది కాదనే అభిప్రాయాన్ని ఆయన ఇదే సందర్భంలో వ్యక్తం చేశారు.