దక్షిణాది చిత్రపరిశ్రమ రాజకీయ రంగంలోకి వలస వెళ్తోంది. తమిళనాట కమల్ హాసన్, రజనీకాంత్ కొత్త పార్టీలను పెట్టే ఆలోచనలో ఉండగా, టాలీవుడ్ లో వాణీ విశ్వనాథ్ టీడీపీలో ప్రవేశించే ప్రయత్నాల్లో ఉన్నారు. కర్ణాటకలో ఉపేంద్ర కొత్త పార్టీని ప్రకటించగా, అదే పరిశ్రమకు చెందిన నటీమణి అమూల్య రాజకీయ రంగప్రవేశానికి సర్వం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఆమె బీజేపీ తరపున రాజకీయ అరంగేట్రం చేసే అవకాశముందని అక్కడి మీడియా పేర్కొంటోంది. అమూల్య భర్త సామాజిక సేవాకార్యక్రమాల్లో చురుగ్గా ఉంటారని తెలుస్తోంది. ఆమె మామ రామచంద్ర, రాజరాజేశ్వరి బెంగళూరు స్థానిక నేతలు కావడం విశేషం.
ఈ నేపథ్యంలో తన భర్త సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్న విశేషాలను ఆమె విరివిగా పోస్టు చేయడం వెనుక కారణం...గాంధీ నగర్ నుంచి పోటీకి దిగేందుకు ప్రయత్నమేనని స్థానిక రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. ఈ నియోజకవర్గం నుంచి జేడీఎస్ తరపున మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు ప్రజ్వల్ గౌడ పోటీకి దిగనున్నాడన్న ప్రచారం నేపథ్యంలో బలమైన అభ్యర్థిని నిలపాలని బీజేపీ భావిస్తోంది. ఈ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మునిరత్నం జేడీఎస్లోకి ఫిరాయించే అవకాశం కూడా ఉందని వారు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ నియోజకవర్గాన్ని చేజిక్కించుకోవాలంటే అమూల్యను బరిలో దింపాల్సిందేనని బీజేపీ భావిస్తోందని, ఈ నేపథ్యంలో ఆమె రాజకీయ అరంగేట్రం ఖాయమని వారు పేర్కొంటున్నారు.