ఆగష్టు 15న విడుదల చేస్తామంటూ చిత్ర ఆరంభం రోజున 'సాహో చిత్ర నిర్మాతలు చెప్పినా, షూటింగ్ పూర్తయ్యేందుకు చాలా సమయం పట్టడం, పైగా నిర్మాణాంతర పనులు ఇంకా పూర్తికాక పోవటంతో విడుదల వాయిదా వేసేందుకు సిద్దమువుతున్నట్టు సమాచారం. ఇందుకు ప్రధాన కారణం విడుదల తేదీ దగ్గర పడుతోందని హడావుడిగా రీరికార్డింగ్, గ్రాఫిక్స్ తదితర పనులు పూర్తిచేస్తే, వాటి ప్రభావం ఖచ్చితంగా అవుట్ ఫుట్ మీద పడే ఆస్కారం ఉన్నట్టు భావించిన నిర్మాతలకు సినిమా విడుదల వాయిదావేయడమే మంచిదని యూనిట్ వర్గాలిచ్చిన సలహా మేరకే నిర్ణయం తీసుకున్నట్టు తెలియవచ్చింది. ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ చిత్రంలో కేవలం 8 నిమిషాల నిడివి ఉన్న సన్నివేశం కోసం ఏకంగా 70 కోట్లు వెచ్చించారంటే చిత్రం ఎంత ఖరీదైనదో అర్ధం చేసుకోవచ్చు. ప్రభాస్ సరసన శ్రద్ద కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సుజిత్ దర్శకుడు. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న యూవీ క్రియేషన్స్ సంస్థ 300 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించింది. కాగా 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవాన ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం ఆగష్టు 30కి వాయిదా వేసే అవకాశాలున్నట్టు సమాచారం.