బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్ బాబు హీరోగా నటిస్తున్న ‘కొబ్బరిమట్ట’ సినిమా ప్రారంభమైనప్పటి నుంచి అనేక ఆటుపోట్లను ఎదుర్కొని ఆగస్ట్ 2న విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ఈ సినిమా విషయంలో ఓ వివాదం రాజుకుంది. కొబ్బరిమట్ట చిత్రంలోని ఓ సన్నివేశాన్ని యువ కథానాయకుడు కార్తికేయ హీరోగా నటించిన ‘హిప్పీ’ సినిమాలో వాడుకున్నారని ఈ చిత్ర నిర్మాత సాయి రాజేశ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
థియేటర్లో కార్తికేయ ‘కొబ్బరిమట్ట’లోని ఓ సన్నివేశాన్ని చూస్తూ పగలబడి నవ్వుకుంటూ ఉంటారు. ఈ సన్నివేశాన్ని రాజేశ్ ట్విటర్లో పోస్ట్ చేస్తూ.. ‘హాయ్ కార్తికేయ.. మీరు నటించిన ‘హిప్పీ’ సినిమాలో ‘కొబ్బరిమట్ట’ చిత్రాన్ని, సంపూర్ణేశ్బాబుని, నన్ను టార్గెట్ చేసిన సన్నివేశాన్ని చూశాను. దీనికి నేను ‘హిప్పీ’ సినిమా దర్శకుడిని తప్పుబట్టను. కానీ, ఈ సన్నివేశాన్ని రాసిన రచయితకు, నటించిన మీకు తెలియాల్సింది ఏంటంటే.. ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి సినిమాను, సహ నటులకు గౌరవం ఇవ్వండి’ అని పోస్ట్ చేశారు.
ఈ పోస్టుపై సంపూ కూడా స్పందించాడు. ‘కార్తికేయ.. నా మీద వేసిన జోక్కి ఫర్వాలేదు. తిట్లు నాకు ఇవాళ కొత్త కాదు. కానీ విడుదల అవ్వని సినిమా గురించి తప్పుగా మాట్లాడటం కరెక్ట్ కాదు. మేము ఎంతో ప్రేమించి, మరెన్నో కష్టాలు పడి తీసిన సినిమా ‘కొబ్బరిమట్ట’. ఇలా కామెడీ చేయడం చాలా బాధాకరం’ అని సంపూ పేర్కొన్నాడు. దీనిపై కార్తికేయ స్పందించాల్సి వుంది.