మెగాస్టార్ చిరంజీవి ఆదివారం పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు ఆయన తాడేపల్లి గూడెం చేరుకోనున్నారు. విశ్వనటుడు ఎస్వీ రంగారావు కాంస్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరిస్తారు. ప్రత్యేక జెట్ విమానంలో హైదరాబాద్ నుంచి గన్నవరం చేరుకుంటారు చిరంజీవి. అక్కడ నుంచి కారులో తాడేపల్లిగూడెం వస్తారు. హౌసింగ్ బోర్డులో ఏర్పాటు చేసిన ఎస్వీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. తాడేపల్లిగూడెం ఎస్వీఆర్ సేవా సమితి గూడెంలో కొన్ని నెలల కిందటే ఎస్వీఆర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. అయితే చిరంజీవితో ఆవిష్కరింప జేయాలని ఎస్వీఆర్ సేవా సమితి సభ్యులు సంకల్పించారు. ఇటు చిరంజీవి కూడా సైరా షూటింగ్లో బిజీగా ఉండటంతో విగ్రహావిష్కరణ వాయిదా పడుతూ వచ్చింది. కొద్దిరోజుల కిందట హైదరాబాద్ వెళ్లి ఎస్వీఆర్ సేవా సమితి సభ్యులు నేరుగా చిరంజీవిని ఆహ్వానించారు. దీనికి చిరంజీవి సానుకూలంగా స్పందించారు. దీంతో రేపు తాడేపల్లి గూడెం చేరుకొని చిరంజీవి... రంగారావు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.