చెన్నై: ప్రముఖ నటి త్రిష ప్రతిష్టాత్మక యునిసెఫ్ సెలబ్రిటీ అడ్వకేట్ హోదాకు ఎంపికయ్యారు. పిల్లలు, యువత హక్కులను కాపాడేందుకు నిర్వహించే కార్యక్రమాల్లో త్రిష భాగస్వామ్యమవుతారని యునిసెఫ్ ఓ ప్రకటనలో వెల్లడించింది. దేశవ్యాప్తంగా ప్రత్యేకించి తమిళనాడు, కేరళ ప్రాంతాల్లో చిన్నపిల్లల్లో ఎనీమియా (రక్తహీనత), బాల్యవివాహాలు, బాలకార్మికులు, చిన్నారులపై వేధింపులు వంటి అంశాల్లో త్రిష తన మద్దతును అందించనుంది.
కౌమార దశలో ఉన్న పిల్లలు, యువతకు త్రిష ఐకాన్ లాంటి వారని..కుటుంబం, బహిరంగ ప్రదేశాలు, కులాల్లో పిల్లలు ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించే అధికారం ఆమెకుంటుందని కేరళ, తమిళనాడు యునిసెఫ్ చీఫ్ జాబ్ జకారియా వెల్లడించారు. వీటితోపాటు చిన్నపిల్లలకు చదువు ఆవశ్యకతను తెలియజెప్పడం, ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించడం, సమాజంలో ఆడపిల్లల ప్రాముఖ్యత వంటి అంశాలను త్రిష ప్రమోట్ చేస్తారని ఆయన తెలిపారు.