తెలుగులో మిగతా స్టార్లందరి కంటే ముందు మార్కెట్ విషయంలో బౌండరీలు దాటిన ఘనుడు అల్లు అర్జున్. పదేళ్ల కిందటే అతడికి కేరళలో మంచి బేస్ ఏర్పడింది. హ్యాపీ సినిమా డబ్బింగ్ వెర్షన్ అక్కడ ఇరగాడేసి బన్నీకి క్రేజ్ తెచ్చిపెట్టింది. అప్పట్నుంచి వరుసగా అతడి సినిమాల్ని డబ్ చేసి రిలీజ్ చేయడం మామూలైంది. బన్నీ క్రేజ్ అంతకంతకూ పెరిగి.. అక్కడి సూపర్ స్టార్లతో సమానంగా ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. బన్నీ సినిమా మీద రూ.5 కోట్ల దాకా పెట్టుబడి పెట్టే స్థాయి వచ్చింది. ఇక మెగా హీరోలకు ముందు నుంచి మంచి బేస్ ఉన్న కర్ణాటకలోనూ బన్నీకి మంచి మార్కెటే ఏర్పడింది. డబ్బింగ్ సినిమాల ద్వారా ఉత్తాదిన కూడా గుర్తింపు సంపాదించుకున్నాడు బన్నీ. ఇక దక్షిణాదిన మిగిలిన తమిళ మార్కెట్ను గ్రాబ్ చేయడం కోసం తెలుగు-తమిళ భాషల్లో ఓ ద్విభాషా చిత్రం చేయాలని ఎప్పట్నుంచో చూస్తున్నాడు బన్నీ. లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమాను అనౌన్స్ చేసిన సంగతి కూడా గుర్తుండే ఉంటుంది. కానీ అది వర్కవుట్ కాలేదు. బాలీవుడ్లో కూడా ఓ సినిమా చేయాలని బన్నీ అప్పట్లో యోచించినట్లుగా వార్తలొచ్చాయి. ఐతే మధ్యలో డీజే, నా పేరు సూర్య సినిమాలు ఫ్లాప్ కవడంతో తెలుగులోనే బేస్ దెబ్బ తినేలా ఉండటంతో బన్నీ వేరే టెరిటరీలపై ఫోకస్ పెట్టడం మానేసి సొంత భాషలో నిలదొక్కుకునే ప్రయత్నంలో పడ్డాడు బన్నీ. ఈలోపు ‘బాహుబలి’ సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ ద్వారా రామ్ చరణ్, ఎన్టీఆర్ కూడా అతడి బాటలో నడుస్తున్నారు. తాజాగా మహేష్ బాబు.. కేజీఎఫ్ దర్శకుడితో ఓ పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేస్తున్నట్లుగా వార్తలొస్తున్నాయి. మొత్తానికి తెలుగులో మిగతా బడా స్టార్లందరూ పాన్ ఇండియా హీరోలైపోయేలా ఉన్నారు. వీళ్లందరి కంటే ముందు తన మార్కెట్ను ఇతర రాష్ట్రాల్లోకి విస్తరించాలని, పాన్ ఇండియా స్టార్ అయిపోవాలని తహతహలాడిన బన్నీ ఇక్కడే ఆగిపోయాడు. మిగతా హీరోల ఎదుగుదల, ప్లానింగ్ చూసి అతనిప్పుడు రగిలిపోతుంటాడని.. ఇప్పుడు కమిటైన సినిమాలు పూర్తయి.. అవి బాగా ఆడితే.. ఆ తర్వాత కచ్చితంగా ఓ పాన్ఇండియా సినిమా కోసం గట్టి ప్రయత్నమే చేస్తాడని టాలీవుడ్ జనాలు అనుకుంటున్నారు.