సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధిస్తే పర్యావరణంలో ఒక్కసారిగా మార్పు రాదంటూ టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఓ లేఖ రాశారు. ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించడం వల్ల అందరి దృష్టి పేపర్ కవర్లు, పేపర్ సంచుల వాటకం మీద పడుతుందని, దీంతో కాగితానికి విపరీతమైన డిమాండ్ పెరగటంతో , దాని తయారీ దారులు తిరిగి అడవులపై పడి చెట్లను ఎక్కువగా నరికే పరిస్థితి నెలకొనే అస్కారం ఉందని అన్నారు.
ఇప్పటికే వాతావరణంలో జరిగిన విపరీతమైన మార్పులకు కేవలం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఒక్కటే కారణం కాదని, అనేక ఇతర అంశాలు సైతం పర్యావరణాన్ని ప్రభావితం చేస్తున్న విషయాన్ని పరిగణలోనికి తీసుకోవాలని సూచించారు. చెట్ల నరికివేతతో పర్యావరణం సమతుల్యత దెబ్బతింటున్న సమస్యలనుంచి బయటపడాలంటే మొక్కలు ఎక్కువగా నాటేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఒక్కసారి వాడిన ప్లాస్టిక్ తిరిగి వినియోగించేలా ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా ప్లాస్టిక్ ను ఎక్కడపడితే అక్కడ పడవేయడం కొంతైనా తగ్గుతుందని పూరీ జగన్నాథ్ తన లేఖలో ప్రధానికి తెలిపారు.