స్టైలిష్ విలన్గా తెలుగు తెరకు పరిచయమైన నటుడు తరుణ్ రాజ్ అరోరా. ‘ఖైదీ నంబర్ 150’ తర్వాత మళ్లీ ‘అర్జున్ సురవరం’ చిత్రంలో ప్రతినాయకుడిగా నటించాడు. ఒకప్పటి తెలుగు హీరోయిన్ అంజలా జవేరి భర్తే తరుణ్ అరోరా. ఇక ‘అర్జున్ సురవరం’ చిత్రం ఘన విజయం సాధించిన సందర్భంగా తరుణ్ అరోరా మాట్లాడుతూ “మోడలింగ్తో నా కెరీర్ మొదలైంది. అందుచేత నేను ప్రతి సినిమాలో స్టైలిష్గా కనిపిస్తాను. అది నటనలోనూ కనిపించేలా చూసుకోవడం నా బాధ్యత. ఆ ప్రయత్నంలో నేను సక్సెస్ అయ్యానన్న సంతృప్తి ఉంది. ఇక ‘అర్జున్ సురవరం’లో నేను చాలా మంచి పాత్రలో నటించాను. తమిళ చిత్రం ‘కణితన్’కి రీమేక్గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
మాతృకలో కూడా నేనే నటించాను. అక్కడ కథ ప్రధానంగా హీరో, విలన్ల మధ్యే సాగుతుంటుంది. తెలుగులో మాత్రం ఇతర పాత్రలకు కూడా ప్రాధాన్యం దక్కింది… సెంటిమెంట్ కూడా తోడైంది. అది ఈ సినిమాకు మరింత మేలు చేసింది. చూసినవాళ్లంతా ఈ సినిమా బాగుందని అంటున్నారు. నటనలో భాష కంటే భావం ముఖ్యం. ఎక్కడైనా భావాలు, భావోద్వేగాలు ఒకే రకంగా ఉంటాయి. ఇక అంజలా జవేరి, నేను ముంబయిలో ప్రేమలో పడ్డాం.
నేను మోడలింగ్ చేసేవాడిని, ఆమె నటిగా ఉంది. ఆ సమయంలో ఇద్దరికి పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నాం. మాకు పిల్లలు లేరు. పిల్లలు వద్దనుకున్నాం. మేమే ఒకరికొకరు పిల్లల్లాగా ఉంటాం. ఇక అంజలా జవేరి మంచి కథ కోసం ఎదురుచూస్తోంది. ఈ దశలో తనకు తగ్గ కథ, పాత్ర చేయాలని ప్రయత్నం చేస్తోంది. త్వరలో ఆమె నటించే చిత్రం వివరాలను తెలియజేస్తాము”అని అన్నారు.