అల్లుఅర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్లో అలరించనున్న చిత్రం ‘అల వైకుంఠపురంలో' టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ టీజర్ యూ ట్యూబ్లో ఒక రేంజ్లో దూసుకుపోతోంది. టీజర్ను విడుదల చేసిన 7 నిమిషాల్లోనే 1 మిలియన్ వ్యూస్ ను రాబట్టింది. అత్యంత వేగంగా ఈ స్థాయి వ్యూస్ ను సాధించిన టీజర్ గా నిలిచింది. ఇటీవల మహేష్ 'సరిలేరు నీకెవ్వరు' నుంచి టీజర్ను వదలగా, 9 నిమిషాల్లో 1 మిలియన్ వ్యూస్ మార్కును అందుకుంది. అంతకంటే వేగంగా 1 మిలియన్ వ్యూస్ను రాబట్టినదిగా 'అల వైకుంఠపురములో' టీజర్ సరికొత్త రికార్డును నమోదు చేసింది. తెలుగులో ఈ ఫీట్ మొదటిసారని చెప్పుకోవచ్చు. దీంతో స్టైలిష్ స్టార్ ఫ్యాన్స్ ఆనందానికి ఆకాశమే హద్దు అయింది. కాగా టీజర్ లో "నువ్వు ఇప్పుడే కార్ దిగావ్, నేను ఇప్పుడే క్యారెక్టర్ ఎక్కా" అని చెప్పే డైలాగ్ వీక్షకుల్నీ అమితంగా ఆకట్టుకుంటోంది. 'గీతా ఆర్ట్స్' 'హారిక అండ్ హాసిని క్రియేషన్స్' కాంబినేషన్లో నిర్మిస్తోన్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది.