ప్రేమ కథా చిత్రాలకు ప్రేక్షకుల నుండి ఎప్పుడూ మంచి ఆదరణ లభిస్తూనే ఉంటుంది. అందుకే స్టార్ హీరోలు సైతం కనీసం ఒక్క లవ్ స్టోరీ సినిమాలోనైనా నటించాలని కోరుకుంటారు. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ కి హీరోలను లవ్ స్టోరీ తో తెరకెక్కిన సినిమాలు దగ్గర చేస్తాయి. అంతేకాకుండా కుంటుంబ సమేతంగా వచ్చి చూడడానికి వీలు ఉంటుంది. అందుకే ప్రేమ కథా చిత్రాలకు ప్రజాదరణ ఎక్కువ. ఇకపోతే ప్రేమ గొప్పతనాన్ని తెలుపుతూ టాలీవుడ్లో చాలా సినిమాలు వచ్చి బ్లాక్బస్టర్ హిట్ సాధించాయి. ఈ సందర్భంగా ఓసారి ఆ సినిమాలను గుర్తు చేసుకుందాం.
తొలి ప్రేమ: పవన్ కళ్యాణ్ సినిమాలు ఎన్ని బ్లాక్ బస్టర్ అయినా అందులో 'తొలి ప్రేమ' ప్రత్యేకం. ఈ సినిమాకు ఇప్పటికీ ఎందరో అభిమానులు వున్నారు. ప్రేమికుడిగా పవన్ నటన అందరిని కట్టిపడేసింది. 24 జులై 1998 లో వచ్చిన ఈ సినిమా యూత్ ని బాగా ఆకట్టుకుంది. అంతేకాదు నేషనల్ అవార్డు కూడా గెలుచుకొని తెలుగు ప్రేమకథ సత్తా చాటింది. పవన్ సరసన ఈ సినిమాలో కీర్తి రెడ్డి హీరోయిన్ గా నటించింది.
ఓయ్: ఓ ఉన్నత వ్యాపారవేత్త కుటుంబానికి చెందిన వ్యక్తి ఒక సాధారణ అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయి సంతోషం కోసం ఏం చేసాడు అనే కథే 'ఓయ్'. ఓయ్ క్లాసిక్ సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. ఈ సినిమా సిద్దార్థకు బోలెడంత లేడీ ఫాన్స్ ను సంపాదించి సిద్దార్థకు లవర్ బాయ్ ఇమేజ్ ను తెచ్చి పెట్టింది. ఈ సినిమాలో షామిలి హీరోయిన్ గా నటించింది.
గీతాంజలి: చావుకు దగ్గరవుతున్న ఇద్దరు వ్యక్తులు మధ్య మొదలైన ప్రేమ 'గీతాంజలి'. ఈ చిత్ర విడుదల తరువాత నాగార్జున ఆంధ్ర అందగాడుగా కీర్తిగాంచాడు. ఎందరో అమ్మాయిల మనస్సు దోచుకున్న మన్మధునిగా నాగార్జున నిలిచిపోయారు. గీతాంజలి లాంటి సినిమా ఒక్కటైనా చేయాలని ఇండస్ట్రీలో ప్రతి ఒక్క హీరో ఎదురుచూస్తున్నాడంటే అతిశయోక్తి కాదు. ఈ సినిమా చిత్రీకరణ మొత్తం 60 రోజుల్లో పూర్తి అవ్వడం విశేషం.
మనసంతా నువ్వే: 'మనసంతా నువ్వే' సినిమా ప్రేమికుల మనసు దోచుకుంది. ఉదయ్ కిరణ్ కు ఈ సినిమాతో హ్యాట్రిక్ విజయాలను అందుకున్నాడు. వీఎన్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ఉదయ్ కిరణ్, రీమాసేన్ ప్రేమాయణం ప్రేమికుల హృదయాలను హత్తుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలోని క్లైమాక్స్ ఎప్పటికి గుర్తుండిపోతుంది. సినిమాలో కథానాయకుని పాత్రకు మొదట మహేష్ బాబు ను అనుకున్నారు. కానీ మహేష్ అప్పటికే రాజకుమారుడు, మురారి సినిమాలు చేసి ఉండడంతో ఎవరైనా కొత్తవారికోసం వెతుకుతుండగా ఉదయ్ కిరణ్ కు ఛాన్స్ వచ్చింది.