త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన అజ్ఞాతవాసి చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కీర్తి సురేష్, అను ఎమ్మాన్యుయేల్ కథానాయికలుగా నటించారు. ఖుష్బూ, బొమన్ ఇరానీ, మురళీ శర్మ తదితరులు ముఖ్య పాత్ర పోషించారు. విక్టరీ హీరో వెంకటేష్ కూడా ఈ చిత్రంలో కొద్ది సేపు కనిపిస్తాడనే ప్రచారం కొద్ది రోజుల నుండి జరుగుతూ వచ్చింది. ఓ కామెడీ సీన్ లో పవన్ కి మేనమామగా కనిపించనున్నాడని కొందరు చెప్తే, యాక్షన్ సీన్ లో 4 నిమిషాల పాటు వీరంగం సృష్టిస్తాడని మరి కొందరు అన్నారు. మరికొందరైతే సినిమా విడుదలయ్యాక ఇవన్నీ రూమర్స్ అని ఖండించారు.
అజ్ఞాతవాసి చిత్రంలో వెంకటేష్ ఓ కామియో పాత్ర పోషించాడని, ఆయనకి సంబంధించిన సన్నివేశాలు సంక్రాంతి నుండి అందుబాటులో ఉంటాయని చిత్ర నిర్మాణ సంస్థ ఓ మేకింగ్ వీడియో విడుదల చేశారు. వెంకటేశ్, పవన్ కల్యాణ్లు చెప్పిన డబ్బింగ్ను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ తమ ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది. విక్టరీ వెంకటేశ్, పవన్ కల్యాణ్ పక్క పక్కన కూర్చొని డైలాగులు చెప్పుకుంటుండగా, పవన్ .. గురు గారూ.. గురూ గారు అని అన్నాడు. దీనికి వెంకీ గారు అక్కర్లేదమ్మా గురు చాలు.. అని డైలాగ్ విసిరాడు. ఇక నాక్కొంచం తిక్కుంది అని పవన్ అనగా దానికో లెక్కుంది అని, అదీ అదీ డైలాగు అని వెంకటేశ్ అనడం వీడియోలో చూడొచ్చు. వీరిద్దరి మధ్య జరిగిన సన్నివేశాలు మంచి ఎంటర్ టైనింగ్ ఉంటాయని ఈ వీడియో ద్వారా అర్ధమవుతుంది. పవన్ –వెంకీ కాంబినేషన్ లో వచ్చిన గోపాల గోపాల మల్టీ స్టారర్ చిత్రంలో పవన్ దేవుడిగా స్పెషల్ రోల్ పోషించిన సంగతి తెలిసిందే.