కరోనా మహమ్మారి దెబ్బకు అన్ని రంగాలు కుదేలైన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా దేశం మొత్తం స్తంభించిపోయింది. సినీ పరిశ్రమ సైతం షూటింగ్స్ను వాయిదా వేయడంతో సినీ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న రోజువారీ సినీ కార్మికులు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఏరోజుకారోజు కూలీ చేసుకునే వారి పరిస్థితి మరింత ఘోరంగా మారింది. దీంతో వారికి కుటుంబ పోషణ కష్టంగా మారింది. దీంతో వీరికి అండగా ఉండేందుకు ఇప్పటికే చాలా మంది ముందుకు వచ్చి తమకు తోచిన సాయం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా హీందీ నటుడు అజయ్ దేవ్గణ్ తన వంతుగా రూ.51 లక్షలను ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయిస్ సంస్థకు విరాళంగా అందించాడు. ఈ సందర్భంగా ఎఫ్డబ్ల్యూఐసీఈ అధికారి అశోక్ పండిట్ ఓ ట్వీట్ చేశాడు. ‘5 లక్షల మంది సినీ కార్మికుల సహాయార్థం రూ.51 లక్షలను ఎఫ్డబ్ల్యూఐసీఈ సంస్థకు అజయ్ దేవగణ్ అందించడం మాకెంతో సంతోషంగా ఉందని పేర్కోన్నాడు. అంతేకాకుండా ఆయన తన ట్వీట్లో ఇలాంటి ఆపత్కాలంలో అభాగ్యులకు సాయం చేసేందుకు మీరు ఎప్పుడూ ముందుంటారని అజయ్ను ఉద్దేశిస్తూ.. మీరు రియల్ లైఫ్ సింగం అంటూ ధన్యవాదాలు తెలిపాడు. కాగా అజయ్ ఈరోజు తన 51వ పుట్టిన రోజును జరుపుకుంటున్నాడు.