అభిమాన స్టార్పై ఉన్న ప్రేమను తెలపడానికి, తెలుసుకోవడానికి సోషల్మీడియా ఓ వేదికగా మారిపోయింది. ఇష్టమైన స్టార్తో కలిసి పనిచేసిన వారిని 'మా హీరో గురించి ఒక్క మాట చెప్పండి?' అని అడగడం ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో చూశాం. తాజాగా 'మిర్చి' నటి రిచా గంగోపాధ్యాయ ఓ ట్వీట్ చేశారు. సంవత్సరంలో మొదటి త్రైమాసికం పూర్తయిందని.. ఆనందంగా గడపాల్సిన రోజులు ఇంకా చాలా ఉన్నాయని అన్నారు. 'ఇలాంటి కష్ట సమయంలో (కరోనాను ఉద్దేశిస్తూ) మిమ్మల్ని మీరు రీఛార్జ్ చేసుకోవడానికి ఏం చేస్తున్నారు' అని ఫాలోవర్స్ను ఉద్దేశించి ప్రశ్నించారు.
దీనికి ఓ నెటిజన్.. 'మేడమ్ ప్రభాస్ గురించి ఒక్కమాట చెప్పండి. మానస ('మిర్చి'లో పాత్ర) మీరు సంతోషంగా ఉండాలి కోరుకుంటున్నా' అని కామెంట్ చేశారు. దీనికి రిచా స్పందిస్తూ.. 'ప్రభాస్ నిజంగా ఓ అద్భుతమైన వ్యక్తి. చాలా వినయంగా ఉంటారు. నాకిష్టమైన సహ నటుల్లో ఆయనొకరు' అని చెప్పారు. మరో నెటిజన్ కూడా.. 'ప్రభాస్ గురించి ఒక్క మాట చెప్పండి?' అని అడిగారు. 'మీరు 'వన్ వర్డ్' ఎన్నిసార్లు అడుగుతారు.. నేను ఇప్పటికే మీకు చెప్పాను..' అని నవ్వుతూ రిచా సమాధానం ఇచ్చారు. 'మా వాళ్లకి ప్రభాస్ అంటే పిచ్చిలే అక్క.. పట్టించుకోవద్దు..' అని మరో ఫాలోవర్ నటిని ఉద్దేశించి అన్నారు. దీనికి ఆమె మళ్లీ రిప్లై ఇస్తూ.. 'నాకు తెలుసు..' అని ట్వీట్ చేశారు.రిచా గత కొన్నేళ్లుగా నటనకు దూరంగా ఉన్నారు. 2013లో 'భాయ్' సినిమా తర్వాత ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లారు. అక్కడి బిజినెస్ స్కూల్లో క్లాస్మేట్ జోను ప్రేమించారు. ఇటీవల పెద్దల అంగీకారంతో ఇద్దరి వివాహం జరిగింది.