సినిమా ఇండస్ట్రీ చాలా మంది జాతకాలు మార్చేస్తుంది. కూటికి కూడా లేనివాళ్లకు కోట్లు తీసుకొచ్చి పెడుతుంది. అయితే సక్సెస్ అయిన తర్వాత అందరి గురించి చెప్పుకుంటారు. కానీ వాళ్లు ఆ సక్సెస్ కావడానికి ఎంత టైమ్ పట్టింది.. ఎన్నేళ్లు కష్టపడ్డారు అనేది మాత్రం చాలా మందికి తెలియదు. అలాగే తెలుగు ఇండస్ట్రీతో పాటు మరో నాలుగు భాషల్లో సత్తా చూపించి.. ఎన్నో వందల సినిమాల్లో నటించిన సాయాజి షిండే గురించి అందరికీ తెలుసు. కానీ ఆయన వాచ్మెన్గా పని చేసాడని ఎంతమందికి తెలుసు..? సినిమా ఇండస్ట్రీకి రాకముందు ఆయన మూడేళ్ల పాటు ఒక కాలేజ్ వాచ్ మెన్గా పని చేసాడు.పేరుకు మరాటి నటుడు అయినా కూడా తెలుగులో తన డబ్బింగ్ తానే చెప్పుకుంటూ ప్రత్యేకంగా ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు షిండే. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా.. లారీ ఢీ ముగ్గురు ఠా అంటూ పోకిరి సినిమాలో ఈయన చెప్పిన డైలాగులు ఇంకా అందరికీ గుర్తుండే ఉంటాయి. దానికంటే ముందే చిరంజీవి ఠాగూర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈయన.. ఆ తర్వాత 50 సినిమాలకు పైగా నటించాడు. అందులో 90 శాతం సినిమాల్లో సొంతంగా డబ్బింగ్ చెప్పుకొన్నాడు. తెలుగు భాష కాకపోయినా కూడా అర్థం తెలుసుకుని మరీ డబ్బింగ్ చెప్తాడు షిండే.ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో తన పర్సనల్ విషయాల గురించి బయట పెట్టాడు. తాను మహారాష్ట్రలో పుట్టానని.. తనది చాలా పేద కుటుంబం అని చెప్పాడు సాయాజీ షిండే. తన ఊర్లో ఏడో తరగతి వరకు చదువుకున్న తర్వాత పక్క ఊరికి వెళ్లి టెన్త్ కంప్లీట్ చేసి ఆ తర్వాత కాలేజీలో జాయిన్ అయ్యానని.. అక్కడ ఫీజు కోసం అదే కాలేజీలో మూడేళ్లపాటు వాచ్ మెన్గా చేశానని చెప్పాడు షిండే. పగలు చదువుకోవడం రాత్రి అదే కాలేజీలో వాచ్ మెన్గా ఉండటం.. ఆ వచ్చిన డబ్బులతో ఫీజ్ పట్టుకోవడంతో పాటు తన నెలసరి ఖర్చులు చూసుకునేవాడినని చెప్పాడు ఈయన.ఆ తర్వాత 1978, 79 ప్రాంతంలో నాటకాల వైపు వెళ్లానని.. అక్కడి నుంచి సినిమాల వైపు తన ప్రయాణం సాగిందని చెప్పాడు. 1987లో ఈయన నటించిన జుల్వా అనే నాటకం ఈయనకు మంచి పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత కూడా మరాఠీలో మరికొన్ని నాటకాలు వేసాడు ఈయన. అక్కడ్నుంచి మెల్లగా వెండితెరపై మెరిసాడు. మరాఠీ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న షాయాజీ షిండే ఆ తర్వాత దేశవ్యాప్తంగా చాలా భాషల్లో నటించి స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యాడు.