టాలీవుడ్లో మరో విషాదం చోటుచేసుకుంది ప్రముఖ మిమిక్రీ కళాకారుడు, నటుడు హరికిషన్ కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం తుదిశ్వాస విడిచారు. ఎనిమిదేళ్ల వయసులో మిమిక్రీ చేయడం మొదలు పెట్టిన హరికిషన్ జాతీయ, అంతర్జాతీయ వేదికలపై వేల ప్రదర్శనలు ఇచ్చారు. అగ్ర నటుడు ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ నుంచి చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్లతో పాటు ఎంతో మంది సినీ నటుల గొంతులను ఆయన అనుకరించేవారు. కేవలం సినిమాల్లో వారు చెప్పిన డైలాగ్లు అనుకరించడమే కాదు, కొన్ని చిన్న స్కిట్లను వారు చేస్తే ఎలా ఉంటుందో చేసి చూపించేవారు. అవన్నీ ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించేవి. సినీనటులు మాత్రమే కాదు, తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులు చంద్రబాబు, వైఎస్ఆర్, కేసీఆర్, వీహెచ్ తదితర ఎంతోమందిని హరికిషన్ అనుకరించి అలరించేవారు. పలు చిత్రాల్లోనూ చిన్న చిన్న పాత్రలు పోషించారు.ఆయన మరణంతో టాలీవుడ్ లో విషాదఛాయలు నెలకొన్నాయి.