తెలుగు పరిశ్రమ దర్శకదిగ్గజం , దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు జన్మదినం నేడు. దశాబ్దాలపాటు మేటి దర్శకునిగా వెలుగొందిన రాఘవేంద్ర రావు మే 23వ తేది 1941న జన్మించారు. నవరసాలు మేళవించి సినిమా తీయడం ఆయన ప్రత్యేకత. శృంగార రసాన్ని తెరపై అద్భుతంగా ఆవిష్కరించడంలో దిట్ట అయిన రాఘవేంద్ర రావు “అన్నమయ్య”, “శ్రీరామదాసు” వంటి చిత్రాల ద్వారా తాను భక్తిరస చిత్రాలను కూడా తీయగలనని నిరూపించుకున్నారు. 80, 90 దశకాలలో నాటి స్టార్ హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్ ఆర్, చిరంజీవి లతో సూపర్ హిట్ మూవీస్ తీసి, మేటి కమర్షిల్ దర్శకునిగా పేరుగాంచారు. ప్రేమ్ నగర్ వంటి అద్భుత చిత్రాల దర్శకుడు కోవెలమూడి ప్రకాశరావు తనయుడే దర్శకేంద్రుడు. ఆయన కృష్ణా జిల్లాలోని కంకిపాడు మండలం కోలవెన్నులో జన్మించారు. తన తండ్రితో పాటు ప్రముఖ దర్శకులు విక్టరి మదుసూదన్ దగ్గర శిష్యరికం చేసిన పిదప తన 33వ ఏట తొలిసారి దర్శకుడిగా చేశారు. 1975లో శోభన్ బాబు హీరోగా వచ్చిన బాబు సినిమాతో దర్శకుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. అనంతరం ‘జ్యోతి’, ‘కల్పన’ వంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో తన ప్రస్థానం మొదలుపెట్టి ఎన్టీఆర్ హీరోగా తీసిన ‘అడవి రాముడు’తో కమర్షియల్ చిత్రాల వేట మొదలు పెట్టారు.
అన్నమయ్య’ హిట్ తర్వాత చేసిన శ్రీమంజునాథ, శ్రీరామదాసు, పాండురంగడు, శిరిడిసాయి, ఓం నమో వేంకటేశాయ వంటి ఆధ్యాత్మిక చిత్రాలను నేటి తరానికి అందించండంలో కేరాఫ్ అడ్రస్ గా నిలిచాడు. ఇలా అన్ని రకాల చిత్రాలను తీయడంలో సిద్ధహస్తుడని నిరూపించుకున్నారు రాఘవేంద్రరావు. అడవి రాముడు, సింహా బలుడు, వేటగాడు, డ్రైవర్రాముడు, గజదొంగ, కొంటవీటి సింహం, తిరుగులేని మనిషి, జస్టిస్ చౌదరి వంటి అద్భుతమైన హిట్ చిత్రాలు తీసి కమర్షియల్ చిత్రాలను కొత్త పుంతలు తొక్కించారు. ‘అగ్ని పర్వతం’ సినిమాతో సూపర్ స్టార్ కృష్ణ జీవితాన్నే మార్చేశారు. అడవిదొంగ, ఘరానమొగుడు, రౌడి అల్లుడు, జగదేకవీరుడు అతిలోక సుందరి, ఇద్దరు మిత్రులు వంటి ఎన్నో హిట్ చిత్రాలని చిరంజీవికి ఇచ్చి అతన్ని మెగాస్టార్గా మార్చడంలో తన వంతు పాత్ర పోషించారు. ఎన్టీఆర్, కృష్ణ, శోభన్ బాబు మొదలుకుని బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, మోహన్ బాబు, జగపతి బాబు, రాజశేఖర్ వంటి రెండో తరం హీరోలతో చేసి ఎన్టీఆర్, మహేశ్ బాబు, అల్లూ అర్జున్, మనోజ్, నితిన్ వంటి నేటి తరం కుర్ర హీరోల వరకూ అందరినీ కవర్ చేశారు.