ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా అనే మహామ్మారితో పోరాడుతున్నాయి. ఈ వైరస్ కట్డడిలో భాగంగా దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే నాలుగు పర్యాయాలు కేంద్రం లాక్డౌన్ పొడిగించిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే లాక్డౌన్ కారణంగా సినీ పరిశ్రమలో అన్నిరకాల షూటింగ్స్ ఆగిపోయాయి. సినిమా షూటింగ్లు, థియేటర్ల ఓపెనింగ్ తదితర అంశాలపై చర్చించేందుకు మరోసారి భేటీ అయ్యారు తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. మాసాబ్ ట్యాంక్లోని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయ ఆవరణలోని కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన ఈ సమావేశంలో నిర్మాతలు సి. కళ్యాణ్, దిల్ రాజు, డైరెక్టర్ ఎన్.శంకర్, మా అధ్యక్షుడు నరేష్, ఎఫ్డిసి మాజీ చైర్మన్ రాంమోహన్ రావు, జీవిత, పలువురు నిర్మాతలు, ఎగ్జిబిటర్స్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. ''సినీరంగం పట్ల ప్రభుత్వం ఎప్పుడూ సానుకూల ధోరణితోనే వ్యవహరిస్తుంది. లాక్డౌన్తో సినిమా, టీవీ సీరియల్స్ షూటింగ్లు నిలిచిపోయాయి. ఈ రంగాలపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మంది కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సినీ రంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలను తీసుకుంటుంది. పోస్ట్ ప్రొడక్షన్ చేసుకునేందుకు సంబంధించి ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. షూటింగ్లు, థియేటర్స్ ఓపెనింగ్లకు సంబంధించి పరిశీలించి తగు నిర్ణయాలు తీసుకుంటాం. ముఖ్యమంత్రి వద్ద సినీ ప్రముఖులతో ఇప్పటికే సమావేశంలో పలు అంశాలను చర్చించడం జరిగింది. తెలుగు సినీ పరిశ్రమకు బెస్ట్ పాలసీని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలను సిద్దం చేస్తుంది. 28వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీతో సినీ రంగంలోని పలు విభాగాలకు చెందిన ప్రముఖులతో సమావేశమై పలు అంశాలను చర్చించిన తర్వాత ఏం చేయాలనేది తెలియజేస్తాం..'' అని అన్నారు.