లాక్ డౌన్ నేపథ్యంలో విలన్ లు హీరోలయ్యారు. అదేంటి విలన్ లు హీరోలవ్వడం ఏమిటని ఆలోచిస్తున్నారా...? నిజమే తెరపై విలన్ వేషంలో కఠినంగా, కర్కశంగా కనపడే వారు లాక్ డౌన్ లో పేదలు, వలస కార్మికులకు అండగా నిలబడ్డారు. ఈ రోజు యావత్ దేశం వారిని హీరోలుగా కీర్తిస్తుంది. తెరపై హీరోలుగా కనపడిన వారు ఇళ్లకు పరిమితమైన సమయంలో... విలన్లు ఇళ్ల నుండి బయటకు వచ్చి హీరోలుగా నిలబడ్డారు.
ఎన్నో సినిమాల్లో విలన్ గెటప్ లో కనపడిన ప్రకాష్ రాజ్ దేశాన్ని కరోనా కుదిపేస్తున్న ఈ కల్లోల సమయంలో రోజూవారి కూలీలు, పేదలకు సహాయం చేస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. ఒకానొక సమయంలో ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ తన దగ్గర డబ్బులు అయిపోయినా కూడా వెనక్కితగ్గనని, బ్యాంకులో రుణం తీసుకునైనా సరే సేవా కార్యక్రమాలు కొనసాగిస్తానని ప్రకాష్ రాజ్ తెలిపారు. దీంతో ఇప్పటికే పలువురు ఆయనను అభినందిస్తూ తమకు చేతనయిన సాయం తాము చేస్తామని అంటున్నారు.
ఇక మరో విలన్ సోనూ సూద్ కూడా ఈ బాటలోనే నడుస్తున్నారు. ఎర్రటి ఎండని సైతం లెక్కచేయకుండా తమ సొంత రాష్ట్రాలకు కాలినడక పట్టిన వలస కూలీల కష్టాలు చూసి సోనూ సూద్ చెలించిపోయాడు. వారి కోసం ప్రభుత్వ అనుమతులతో బస్సులు ఏర్పాటు చేశాడు. ఇప్పటిదాకా దాదాపు 12 వేల మందికి పైగా వలస కార్మికులను ఇళ్లకు చేర్చాడు. తాజాగా సోనూ చేస్తున్న ఈ పనిపై టీమ్ ఇండియా ఓపెనర్ శిఖర్ ధవన్ ప్రశంసల జల్లులు కురిపించాడు. ‘‘సోనూ సూద్.. కష్టాల్లో ఉన్న వలసకూలీలను వాళ్ల సొంత ఊళ్లకు తరిలించడానికి నువ్వు చేసిన వీరోచిత ప్రయత్నానికి నా బిగ్ సెల్యూట్’’ అని ట్వీట్ చేశాడు. దీంతో సోనూ పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. అతడికి అందరూ సలాం కొడుతున్నారు.