నటరత్నగా ప్రసిద్ధిగాంచిన నందమూరి తారకరామారావు 1923వ సంవత్సరం మే 28న కృష్ణా జిల్లా నిమ్మకూరులో జన్మించారు. 1949లో మనదేశం చిత్రం ద్వారా ఆయన తెరంగ్రేటం చేసారు. మాయాబజార్, గుండమ్మకథ, దానవీరశూరకర్ణ, భూకైలాస్, దేవుడు చేసిన, మనుషులు, కొండవీటి సింహం, సర్దార్ పాపారాయుడు, మేజర్ చంద్రకాంత్, లవకుశ తదితర చిత్రాలు ఆయనకు ఎంతో గుర్తింపును తీసుకువచ్చాయి. ఆయన బసవతారకం ను వివాహం చేసుకున్నారు.
ఎన్టీ రామారావు 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని స్థాపించారు. 1983లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘనవిజయం సాధించింది. దీంతో ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 1984లో జరిగిన అనూహ్య ఘటనల వల్ల ఆయన పదవిని కోల్పోయారు. నాదెండ్ల భాస్కరరావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత 1985లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ మళ్ళీ విజయం సాధించడంతో ఎన్టీఆర్ రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
1989లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ చిత్తుగా ఓడిపోయింది. వంగవీటి మోహన్ రంగా హత్య, ఇంకా వివిధ కారణాలతో టీడీపీ చతికిలపడింది. కల్వకుర్తిలో ఎన్టీఆర్ ఘోరపరాజయాన్ని చవిచూశారు. 1994లో టీడీపీ మళ్ళీ విజయం సాధించగా ఎన్టీఆర్ మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. పాలనా వ్యవహారాల్లో ఎన్టీఆర్ రెండవ భార్య లక్ష్మీపార్వతి జోక్యం పెరిగిందని ఆరోపిస్తూ ఎన్టీఆర్ అల్లుడు చంద్రబాబు తిరుగుబాటు చేసారు.దీంతో ఎన్టీఆర్ తన పదవిని కోల్పోయారు. 1996వ సంవత్సరం జనవరి 18న ఎన్టీఆర్ గుండెపోటుతో కన్నుమూశారు. సినీ పరిశ్రమకు ఎన్టీఆర్ చేసిన సేవలకు గానూ కేంద్రం 1968లో పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.