సరిలేరు నీకెవ్వరు లాంటి సినిమా తర్వాత మరోసారి కుర్ర దర్శకుడినే నమ్ముకుంటున్నాడు మహేష్ బాబు. ప్రస్తుతం ఈయన పరశురామ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా ఓపెనింగ్ మే 31న జరగనుందని చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతూనే ఉంది. కరోనా నేఫథ్యంలో చాలా తక్కువ మందితోనే ఈ ఓపెనింగ్ చేయాలని దర్శక నిర్మాతలు కూడా ప్లాన్ చేసారు. కానీ ఇప్పుడు పోలీసులు మాత్రం మహేష్ బాబు సినిమాకు షాక్ ఇచ్చారు. కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాను మే 31న ఘనంగా లాంఛ్ చేయాలనుకుంటే ఇప్పుడు పోలీసుల నుంచి అనుమతి రాలేదని తెలుస్తుంది.
దాంతో ఈ ప్లాన్ వెనక్కి తీసుకున్నారు దర్శక నిర్మాతలు. ఓపెనింగ్ లేకపోయినా కూడా అధికారికంగా ఆ రోజు ట్విట్టర్లో ఓ టైటిల్ లోగో విడుదల చేయాలని చూస్తున్నారు మేకర్స్. అందులోనే సినిమాకు పని చేస్తున్న సాంకేతిక నిపుణుల జాబితాను కూడా విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.. పిఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ అందించబోతున్నాడు. వరసగా మూడు సినిమాలు దేవీ శ్రీ ప్రసాద్తోనే చేసిన మహేష్.. చాలా రోజుల తర్వాత మళ్లీ తమన్ వైపు వచ్చాడు.
ఇక పరశురామ్ ఇదివరకే తమన్తో పని చేసాడు. ఈ సినిమాను పక్కా కమర్షియల్ కథతోనే తెరకెక్కిస్తున్నాడు పరశురామ్. మహేష్ బాబు ఇమేజ్కు సరిపోయేలా ఓ కమర్షియల్ కథను సిద్ధం చేసాడు. ఆర్థిక నేరాల నేపథ్యంలో సినిమా కథ ఉంటుందని తెలుస్తుంది. అందుకే దీనికి సర్కార్ వారి పాట అనే టైటిల్ అనుకుంటున్నాడు దర్శకుడు పరశురామ్. కచ్చితంగా ఈ చిత్రంతో మహేష్ మరోసారి బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించడం ఖాయం అంటున్నారు అభిమానులు. మరి వాళ్ల నమ్మకాన్ని పరశురామ్ ఎంత వరకు నిలబెడతాడో చూడాలిక.