కరోనా మహమ్మారిని కట్టడి చేసే చర్యల్లో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో అన్ని పరిశ్రమలు మూతపడ్డాయి. అయితే ఈ లాక్ డౌన్ కారణంగా ముఖ్యంగా రోజువారి పనులు చేస్తూ పొట్టనింపుకునే కార్మికులు తీవ్ర ఇబ్బందుల్నీ ఎదుర్కోంటున్నారు. తినడానికి తిండిలేక చేద్దాం అంటే పనిలేక తీవ్ర అవస్థలు పడ్డారు. అయితే తాజాగా లాక్ డౌన్ 5.0లో కేంద్రం కొన్ని సడలింపులు ఇచ్చింది. కొన్ని షరతులతో దాదాపు అన్ని పరిశ్రమల్నీ ఓపెన్ చేసుకోవచ్చని ప్రకటించింది. టీవీ సీరియళ్ల షూటింగ్కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. గరిష్టంగా 20 మందితో షూటింగ్ చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వగా, అంత కొద్దిమందితో షూటింగ్ సాధ్యం కాదని, కనీసం 60 మందితో కూడిన షూటింగులకు అనుమతి ఇవ్వాలని ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి, టీవీ నిర్మాతల మండలి అధ్యక్షురాలు సుజాత విజయ్కుమార్, కార్యదర్శి కుష్బూ తదితరులు ప్రభుత్వాన్ని కోరారు.వారి విజ్ఞప్తిని పరిశీలించిన ముఖ్యమంత్రి శనివారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే, షూటింగ్ నిర్వహించే ప్రదేశాల్లో ఆయా జిల్లాల అధికారుల అనుమతి తప్పనిసరని ప్రభుత్వం పేర్కొంది. నేటి నుంచే షూటింగులు నిర్వహించుకోవచ్చని ముఖ్యమంత్రి పళనిస్వామి తెలిపారు.