భారత్ తరఫున ఒలింపిక్స్ లో పతకం సాధించిన తొలి మహిళగా రికార్డు సృష్టించిన వెయిట్ లిఫ్టర్ కరణం మల్లీశ్వరి జీవిత చరిత్ర ఆధారంగా ఓ బయోపిక్ ను తెరకెక్కించనున్నట్టు నిర్మాత కోన వెంకట్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. 2000 ఒలింపిక్స్ లో మల్లీశ్వరి భారత ఖ్యాతిని దిగంతాలకు వ్యాపింపజేసిన సంగతి తెలిసిందే.
నేడు కరణం మల్లీశ్వరి పుట్టిన రోజు కాగా, మరో నిర్మాత ఎంవీవీ సత్యనారాయణతో కలిసి ఎంవీవీ సినిమా, కేఎఫ్సీ (కోనా ఫిల్మ్ కార్పొరేషన్) ఈ సినిమాను నిర్మించనున్నట్టు కోన వెంకట్ తెలిపారు. ఇది పాన్ ఇండియా చిత్రమని ఆయన స్పష్టం చేశారు. సినిమాలో కరణం మల్లీశ్వరి పాత్రను చేసే హీరోయిన్ ఎవరన్న విషయమై ఆయన ఎటువంటి స్పష్టతనూ ఇవ్వలేదు. ఈ సినిమాకు సంజనా రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. సినిమాలో నటీనటులు, ఇతర వివరాలు తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగక తప్పదు.