తెలుగులో ఎన్నో పాటలతో ముఖ్యంగా భక్తి పాటలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన జొన్నవిత్లు రామలింగేశ్వరరావుపై కేసు నమోదు అయింది. వివరాల్లోకి వెళితే.. ఓ టీవీ ఛానెల్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఓ వర్గం మనోభావాలు దెబ్బతినేలా మార్చి 23న కరోనాపై ఓ పద్యం పాడినట్లు ఆరోపణలు ఎదర్కొంటున్నారు. ఆయన పాడిన పద్యం అంటరానితనాన్ని ప్రోత్సహించేలా ఉందని కొంత మంది ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కింద నాంపల్లి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఆయనపై కేసు బుక్ అయింది. అంటరానితనాన్ని కొనసాగించేలా ఈయన పాడిన పద్యం ఉందంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏప్రిల్ 14న భారతరత్న అంబేద్కర్ జయంతి రోజునే ఓ యూట్యూబ్ ఛానెల్లో ఆ పద్యాన్ని అప్లోడ్ చేశారని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రాం ప్రసాద్ ఫిర్యాదు చేశారు. ఈ కేసులో న్యాయ సలహా ప్రకారం ఆయన పై తదుపరి చర్యలు తీసుకోనున్నట్టు పోలీసులు తెలిపారు.
ఈయన తెలుగులో మురళీ మోహన్ ద్వారా రాఘవేంద్రరావుతో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత మొదట ‘భారతంలో అర్జునుడు’ సినిమాకు మొదట పాటలు రాసే అవకాశం వచ్చింది. కానీ ఆ సినిమా కంటే ముందు విడుదలైంది ‘రౌడీ పోలీస్’. ఆ తర్వతా జంధ్యాల, బాపు లాంటి దర్శకులు ఆయనకు అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించారు. ముఖ్యంగా జంధ్యాల దర్శత్వంలో వచ్చిన ‘ష్ గప్చుప్’ సినిమాలో ఆయన రాసిన తిట్ల దండకం బాగా పాపులర్ అయింది. ఆ తర్వాత వంశీ దర్శకత్వంలో వచ్చిన స్వరకల్పన సినిమాలో సప్త స్వరాలను మాత్రమే వాడి ఓ పాట రాశారు. వంశీ సినిమా కోసం సంస్కృతం రాసిన డిస్కో, జంధ్యాల సినిమాలకు రాసిన తిట్ల దండకం ఆయనకు పేరు తీసుకొచ్చాయి. ఒకవైపు వెరైటీ పాటలు రాస్తూనే.. కమర్షియల్ సినిమాల్లో ఎన్నో సూపర్ హిట్ పాటలు రాసారు. ఇక బాపు చివరి సినిమా అయిన శ్రీరామరాజ్యం సినిమాలోని పాటలు ఈయనకు మంచి పేరు తీసుకొచ్చాయి. ఆ తర్వాత ఢమరుకం సినిమాలో శివ శివ శంకర పాట కూడా ఎంతో పాపులర్ అయిందో తెలసిందే కదా. 1997లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈయన్ని తెలుగు అధికార భాష సంఘం సభ్యుడు పదవితో గౌరవించారు. ముఖ్యంగా తెలుగులో శంఖారావం పేరుతో ఈయన రాసిన పాటలను మంగళంపల్లి బాలమురళీ కృష్ణ పాడటం విశేషం.