వరసగా నాలుగు విజయా1లు.. అన్నీ స్టార్ హీరోలతోనే.. రాజమౌళి తర్వాత అంతటి ఇమేజ్.. ఆయన ఊ అంటే స్టార్ హీరోలంతా డేట్స్ ఇవ్వడానికి సై అంటారు. అలాంటి దర్శకుడు రెండేళ్లుగా ఒక్క సినిమా కూడా విడుదల చేయలేదు. చిరంజీవితో సినిమా చేయాలని చూసి చివరికి ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా తీసుకురాలేదు. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు 2020లోనే సినిమా తీసుకొద్దామనుకుంటే ఇప్పుడు లాక్డౌన్, కరోనా మరింత భయపెడుతున్నాయి. ఆ దర్శకుడు కొరటాల శివ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సైరా సినిమా తర్వాత కొన్ని రోజులు గ్యాప్ తీసుకుని వచ్చిన చిరంజీవి.. ప్రస్తుతం ఆచార్యతో బిజీగా ఉన్నాడు.
ఈ సినిమా అనుకున్న దానికంటే కూడా చాలా నెమ్మదిగా షూటింగ్ సాగుతుంది. ఇప్పటి వరకు కనీసం 40 శాతం కూడా పూర్తి కాలేదు షూటింగ్. ఈ సినిమా కోసం ఫారెన్ షెడ్యూల్స్ ఏం లేవు.. అంతా ఇక్కడే ప్లాన్ చేస్తున్నాడు కొరటాల శివ. లాక్ డౌన్ ముందు వరకు బాగానే సాగినా కూడా ఒక్కసారిగా భారీ బ్రేక్ రావడంతో అంతా దారి తప్పింది. ఇందులో చిరు లుక్ కూడా ఫ్యాన్స్కు ఫుల్ కిక్ ఇస్తుంది. పక్కా కమర్షియల్ కథతోనే వస్తున్నాడు కొరటాల. దానికి తన స్టైల్ ఆఫ్ సందేశాన్ని కూడా మిక్స్ చేస్తున్నాడు ఈ దర్శకుడు.
ఈ సినిమా కోసం ప్రత్యేకంగా 20 కోట్లకు పైగా ఖర్చుతో ఓ భారీ కాలనీ సెట్ నిర్మించారు. ఈ భారీ సెట్లోనే ఓ యాక్షన్ సన్నివేశాన్ని చిరంజీవిపై ఆ మధ్య తెరకెక్కించాడు కొరటాల శివ. అక్కడే ఓ గుడి సెట్ కూడా వేస్తున్నారు. ఈ చిత్ర కథ అంతా ఓ గుడి చుట్టూనే తిరుగుతుంది. దేవాదాయ శాఖలో జరిగే అన్యాయాలను ఈ సినిమాలో హైలైట్ చేస్తున్నాడు కొరటాల. అందుకే సినిమాలో భారీ సెట్ నిర్మాణం వేసారు. ఇక సెట్లోనే సినిమా ఎక్కువ భాగం షూటింగ్ చేయబోతున్నాడు దర్శకుడు కొరటాల. మరోవైపు ఈ చిత్రం అనుకున్న దానికంటే ఆలస్యం కావడంతో కొరటాల కూడా అసహనంతో ఉన్నాడని తెలుస్తుంది.
భరత్ అనే నేను తర్వాత ఈయన నుంచి ఒక్కటంటే ఒక్క సినిమా కూడా రాలేదు. చూస్తుంటే 2020 కూడా ఖాళీగా వదిలేసేలా కనిపిస్తున్నాడు కొరటాల. చిరంజీవితో సినిమా అంటూ పాపం అక్కడే అడ్డంగా లాక్ అయిపోయాడంటూ ఆయన్ని చూసి నెటిజన్లు కూడా కామెంట్ చేస్తున్నారు. ఆచార్యలో రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు. రాజమౌళి సినిమా డేట్స్ కానీ క్లాష్ అయ్యాయంటే ఆచార్య మరింత ఆలస్యం కావడం ఖాయం. ఎందుకంటే లాక్డౌన్ కారణంగా ట్రిపుల్ ఆర్ కూడా చాలా ఆలస్యమైంది. దాంతో ఆయన కూడా పని త్వరగా పూర్తి చేయాలని ఆరాటపడుతున్నాడు. చూడాలిక.. ఏం జరగబోతుందో..?