లైంగిక వేధింపుల కేసు విషయంలో తనకు మద్దతుగా స్పందించినందుకు నటుడు విశాల్కు హీరోయిన్ అమలాపాల్ థాంక్స్ చెప్పింది. డ్యాన్స్ స్కూల్ యజమాని అళగేశన్ తనతో వ్యాపారం చేయాలని భావించాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. టీ నగర్కు చెందిన వ్యాపారి తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. మలేషియాలో మహిళాభివృద్ధికి సంబంధించి ‘డ్యాన్సింగ్ తమిళచ్చి’ కార్యక్రమంలో పాల్గొనే క్రమంలో భాగంగా నృత్య పాఠశాలలో శిక్షణ తీసుకుంటున్నానని, ఆ పాఠశాల నిర్వాహకుడైన అళగేశన్ వేధింపులకు పాల్పడ్డాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.
అమలాపాల్ ఫిర్యాదు చేసిన గంటల వ్యవధిలోనే పోలీసులు నిందితుడు అళగేశన్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయంపై కథానాయకుడు విశాల్ స్పందిస్తూ.. అమలాపాల్ ధైర్యాన్ని ప్రశంసించాడు.‘ఎలాంటి బెరుకు లేకుండా ధైర్యంగా ఫిర్యాదు చేసినందుకు హ్యాట్సాఫ్. లైంగిక వేధింపులను బయటపెట్టడానికి నిజంగా చాలా తెగింపు ఉండాలి.’ అంటూ విశాల్ ట్విట్టర్ ద్వారా అమలాపాల్ను కొనియాడాడు. ‘మీ టూ’ అనే హ్యాష్ ట్యాగ్ను జత చేస్తూ.. తనకు మద్దతు తెలిపినందుకు విశాల్కు అమలాపాల్ ధన్యవాదాలు చెప్పింది.‘నా తరఫున మాట్లాడినందుకు థాంక్స్ విశాల్. ఇది ప్రతి మహిళ బాధ్యతగా భావిస్తున్నా. వేధింపులపై మౌనం వహించి, వదిలివేయడం సరికాదని నాకు తెలిసేలా చేశావు’ అని అమలాపాల్ బదులిచ్చింది. అళగేశన్ తనతో వ్యాపారం చేయాలనుకున్నాడని, అతడికి ఉన్న గుర్తింపు, చేసే పనులు చూసి చాలా భయపడిపోయానని ఆమె తెలిపింది.