ఓ ప్రైవేటు కంపెనీకి సంబంధించిన సీఈవో హీరోయిన్ పై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. బెంగుళూరులోని జగ్జీవన్ రాంనగర్ లోని ఓ అపార్ట్ మెంటులో ఓ కన్నడ నటి నివాసం ఉంటుంది. 2018లో ఆమె గాంధీ బజారులోని కాఫీడేకు వెళ్లింది. ఈ సమయంలో కాఫీడేలో ఆమెకు నాయండహళ్లికి చెందిన మోహిత్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ సమయంలో మోహిత్ ఆమెతో పరిచయం పెంచుకొని తాను ఓ కంపెనీ సీఈవోనని నమ్మించాడు. తన కంపెనీకి ప్రచారకర్తగా ఉండాలని ఆమెను కోరాడు.దీన్ని నమ్మిన యువతి ఫోటో షూట్ కోసమని 2019 జనవరి 15న అతనితో గోవాకు వెళ్లింది. అక్కడ ఫోట్ షూట్ చేసిన తర్వాత ఆర్దిక సమస్యలని ఆమె నుంచి రూ.1.50 లక్షలు సదరు సీఈవో తీసుకున్నాడు. జూన్ 22న నటి ఇంట్లో ఆమె పుట్టిన రోజు వేడుకలను ఆయన నిర్వహించాడు. ఈ సమయంలో ఆమెకు కూల్ డ్రింక్ లో మత్తు మందిచ్చి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ దృశ్యాలను చిత్రీకరించి ఆమెను బెదిరించాడు. రూ.11 లక్షలు వసూలు చేశాడు. ఆ తర్వాత మరోసారి బెదిరించి అఘాయిత్యానికి పాల్పడి రూ.9 లక్షలు వసూలు చేశాడు. ఆ తర్వాత అతని వేధింపులు ఎక్కువయ్యాయి. దీంతో విసిగిపోయిన నటి తన తండ్రితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు మోహిత్ కోసం గాలిస్తున్నారు.