దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. సెలబ్రిటీలకు కూడా కరోనా వచ్చిన వార్తలు ఈ మధ్య హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ నటి, ఎంపీ సుమలతకు కరోనా సోకింది. కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయగా రిపోర్టులో పాజిటివ్ వచ్చింది. ఐతే ఒక ఎంపీగా తన నియోజకవర్గంలోని పలు ప్రాంతాలను సందర్శించిన సుమలత.. కరోనా వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ క్రమంలోనే శనివారం ఆమెకు తలనొప్పి, గొంతు నొప్పి రావడంతో అనుమానం వచ్చి.. కరోనా పరీక్షలు చేయించుకున్నారు. దానికి సంబంధించి రిపోర్ట్ ఇవాళ రాగా.. అందులో కరోనా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం సుమలత హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. డాక్టర్ సలహాతో ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారు. ప్రజలందరి ఆశీర్వాదంతో..త్వరలోనే కరోనా నుంచి బయటపడతానని ఆమె చెప్పారు. ఇటీవల తాను కలిసిన వారందరి వివరాలను అధికారులు వెల్లడంచానని తెలిపారు. వారంతా వీలైనంత త్వరగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.