కె. బాలచందర్ అలియాస్ కైలాసం బాలచందర్. దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమ ఖ్యాతిని నలుమూలలా చాటిన దర్శకతేజం. ఈయన 100 చిత్రాలకు పైగా దర్శకత్వం వహించారు. ఎంతో మంది ప్రఖ్యాత సినీనటులను వెండితెరకు పరిచయం చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. మెగాస్టార్ చిరంజీవిని తమిళ పరిశ్రమకు పరిచయం చేసింది ఈయనే. రజనీకాంత్, కమల్ హాసన్, ప్రకాష్ రాజ్ లతో పాటు ఇంకా ఎంతోమంది గొప్పనటులను వెండితెరకు పరిచయం చేసిన దిగ్గజ దర్శకుడు.1930 జులై 9వ తేదీన తమిళనాడులోని తంజావూరు జిల్లాలో బాలచందర్ జన్మించారు. ఉద్యోగం చేస్తూనే నాటకాలు రాసిన బాలచందర్ 'యునైటెడ్ అమెచ్యూర్ ఆర్టిస్ట్స్' అనే డ్రామా కంపెనీని ఏర్పాటు చేసి, పలు ప్రదర్శలు ఇచ్చారు. ఆయన కంపెనీలో ప్రముఖ నటులు షావుకారు జానకి, నగేష్ లాంటి వారు కూడా ఉండేవారు. దాదాపు నాలుగున్నర దశాబ్దాల పాటు సినీపరిశ్రమలో కొనసాగిన బాలచందర్... స్క్రీన్ రైటర్గా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1965లో తొలిసారిగా ఎంజీఆర్ నటించిన దైవతాయ్ సినిమాకి మాటలు రాసే అవకాశం బాలచందర్కు దక్కింది. అదే ఏడాది (1965) నీర్ కుమిళి అనే సినిమాకు దర్శకత్వం వహించారు. అప్పటి నుంచి ఆయన వెనక్కి తిరిగి చూసిన సందర్భమే లేదు. 100 సినిమాలకు పైగా దర్శకుడిగా, నిర్మాతగా, స్క్రీన్ రైటర్ గా ఆయన సేవలందించారు.మరో చరిత్ర, ఇది కథ కాదు, అంతులేని కథ, ఆడవాళ్లు మీకు జోహార్లు, సింధుభైరవి, రుద్రవీణ, అందమైన అనుభవం, బొమ్మా బొరుసా, 47 రోజులు, గుప్పెడు మనసు, ఆకలి రాజ్యం లాంటి సినిమాలు ఆయనకు ఎనలేని గుర్తింపును తెచ్చిపెట్టాయి. మెగాస్టార్ చిరంజీవి నటించిన రుద్రవీణ సినిమాకు ఆయన నర్గీస్ దత్ అవార్డును దక్కించుకున్నారు. సినీకళామతల్లికి ఆయన చేసిన సేవలకు గాను కళైమామణి, పద్మశ్రీ, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు అందుకున్నారు.ఆయన 2014వ సంవత్సరం డిసెంబర్ 23న తుదిశ్వాస విడిచారు. నేడు ఆ దిగ్గజ దర్శకుని జయంతి సందర్భంగా Lokal యాప్ నివాళులు అర్పిస్తోంది.