బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం, తదనంతరం జరుగుతున్న పరిణామాలు నానాటికీ ఆసక్తికరంగా మారుతున్నాయి. తాజాగా సుశాంత్ కుటుంబం 9 పేజీల సుదీర్ఘ లేఖ విడుదల చేసింది. సుశాంత్ ది హత్యేనంటూ ఈ లేఖలో ఆరోపించారు. ఓ కుటుంబంగా తమ మధ్య దృఢమైన సంబంధాలు ఉన్నాయని, పిల్లలు తమ కెరీర్లలో ఎదిగేందుకు గ్రామీణ వాతావరణం నుంచి నగరానికి వచ్చామని వివరించారు.
తల్లి మరణానంతరం ఆమె లేని లోటు తెలియకుండా సుశాంత్ ను పెంచామని, ఆమె ఆశయాలకు అనుగుణంగా సుశాంత్ ను తీర్చిదిద్దామని ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే, పదేళ్లపాటు తన కలల సామ్రాజ్యంలో విహరించిన అతడికి జరగరాని దారుణం జరిగిపోయిందని తెలిపారు. అయితే ఈ కేసులో ఆత్మహత్య అంటూ కట్టుకథలు అల్లారని ఆరోపించారు. సుశాంత్ ది బలవన్మరణం అంటూ చిత్రీకరించారని ఆవేదన వ్యక్తం చేశారు.