కరోనాతో ఆస్పత్రిలో చేరిన ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆగస్టు 5న ఎస్పీ బాలసుబ్రహణ్యం కరోనాతో చెన్నయ్ లోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరారు. ఆ తర్వాత సన్నిహితులు అభిమానులకు ఓ వీడియో సందేశం కూడా పంపారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని త్వరలోనే కోలుకుంటానని ప్రకటించారు. కానీ ఆగస్టు 13న సడన్ గా బాలసుబ్రమణ్యం పరిస్థితి క్షీణించిందని ఎంజీఎం హెల్త్ కేర్ తన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. వైద్య నిపుణుల సూచన మేరకు ఆయన్ను ఐసీయూలో చేర్పించి లైఫ్ సపోర్ట్ సిస్టమ్ తో సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగానే ఉన్నట్లు హెల్త్ బులెటిన్ లో పేర్కొన్నారు. నిపుణుల బృందం బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని తెలిపారు. ఎస్పీబీ ఆరోగ్యం విషమంగా మారడంతో ఆయన అభిమానులలో ఆందోళన నెలకొంది. ఆయన కోలుకోవాలని అందరూ ప్రార్థిస్తున్నారు.