హీరో కమల్ హాసన్ తన అభిమానులు, కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అభిమానులు, తన పార్టీ మక్కల్ నీది మయ్యం కార్యకర్తలపై కమల్ కోపాన్ని ప్రదర్శించారు. కమల్ హాసన్ జయలలిత మరణం తర్వాత రాజకీయ శూన్యతను పూడ్చుకోవడానికి ‘మక్కల్ నీది మయ్యం’ అనే పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. గత సార్వత్రిక ఎన్నికల్లో కమల్ హాసన్ పార్టీ పోటీ కూడా చేసింది. కానీ ఎక్కడా కనీసం ప్రభావం చూపించలేక చతికిలబడింది. తాజాగా తన పార్టీ అభిమానులు, కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్లో ఓ సమావేశం ఏర్పాటు చేసాడు. కరోనా నేపథ్యంలో కమల్ హాసన్ చెన్నైలోని ఓ ప్రైవేటు హోటల్లో ఉంటూ తన పార్టీకి సంబంధించిన పనులను పర్యవేక్షిస్తున్నారు. తాజాగా 350 మంది అభిమానులతో కమల్ దాదాపు మూడు గంటల పాటు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమల్ మాట్లాడుతూ పార్టీ ఆశయాలు, లక్ష్యాలను పార్టీ అధికారిక వెబ్సైట్లో ఆయా విషయాలను ఉంచాలని కోరారు. ఈ సమావేశంలో దాదాపు 37 పైగా అంశాల్లో కమల్ చర్చించినట్టు చెబుతున్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా రాష్ట్రంలోని నెలకొన్న ప్రధాన సమస్యలపై చర్చించారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ సరికొత్త విద్యావిధానం, రిజర్వేషన్లు, టాస్మాక్, రాబోయే అసెంబ్లీ ఎన్నికల అంశాలను చర్చించినట్టు సమాచారం. ముఖ్యంగా హిందూ వ్యతిరేక పార్టీ అనే దుష్ప్రచారాన్ని ఎలా అధిగమించాలనే ప్రశ్న ఈ సమావేశంలో ఎదురైనట్లు చెబుతున్నారు. అంతేకాదు పార్టీ కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరారు. అంతేకాదు ప్రజానుగుణంగా తమ పార్టీ విధానాలు ఉండాలని కమల్ ఈ సమావేశంలో అభిప్రాయపడ్డారు. పార్టీలో ఎలాంటి గందరగోళ పరిస్థితులు ఉండకూడదన్నారు. నా భవిష్యత్తును పూర్తిగా ప్రజాసేవకే అంకితం చేసినట్టు కమల్ చెప్పుకొచ్చారు. కొందరు నా మాటలను వేళాకోలం చేయోచ్చు. కానీ ఇది మాత్రం సత్యం అన్నారు. నా రాజకీయ పయనంలో ఏదైనా ఆటంకం కలిగితే తీవ్ర చర్యలు తీసుకుంటాను. ఆశయాలు, లక్ష్యాలు కాదని తప్పుడు మార్గాల్లో పయనిస్తే.. వారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేసారు. ఒకవేళ కార్యకర్తలు అలా చేస్తే పార్టీని ఎత్తేస్తానని అభిమానులకు, కార్యకర్తలకు హెచ్చరికలు జారీ చేసారు.