రాజమౌళి గత చిత్రాల మాదిరిగానే 'ఆర్ఆర్ఆర్' మూవీకి కూడా చాలా సమయం తీసుకుంటున్నాడు. అయితే తాను అనుకున్న దాని కంటే కూడా ఎక్కువగా గ్యాప్ వస్తుండటంతో నిర్మాతలపై భారం పెరుగుతోంది. అనుకొని సంఘటనలతో 'ఆర్ఆర్ఆర్' షూటింగు తరుచూ వాయిదాలు పడుతుండటంతో రాజమౌళిపై ఒత్తిడి పెరిగిపోతుంది. సినిమా అవుట్ పుట్ విషయంలో రాజీపడని రాజమౌళి కొంతమందితో షూటింగు చేసేందుకు ఇష్టపడటం లేదని తెలుస్తోంది.
'ఆర్ఆర్ఆర్' మూవీలో మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారి కలిసి నటిస్తున్నారు. కొమురంభీంగా ఎన్టీఆర్.. అల్లూరి సీతారామరాజుగా రాంచరణ్ నటిస్తున్నారు. చరణ్ కు జోడిగా అలియాభట్.. ఎన్టీఆర్ కు జోడిగా ఓలివియా నటిస్తోంది. వీరితోపాటు బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్, సీనియర్ నటి శ్రియ కీలక పాత్రలో కన్పించబోతున్నారు.
కరోనాతో 'ఆర్ఆర్ఆర్' షూటింగు వాయిదా పడటంతో స్టార్లంతా ఇంటికే పరిమితయ్యారు. అయితే తాజాగా దర్శకుడు రాజమౌళి తన భార్య రమాతో కలిసి కర్ణాటకలోని బందీపూర్ టైగర్ రిజర్వు ఫారెస్టును సందర్శించారు. ఈ ప్రాంతమంత కలియదిరిగారు. అనంతరం అక్కడే ఉన్న వేణుగోపాలస్వామి ఆలయంలో పూజలు చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయితే రాజమౌళి సడెన్ టూర్ వెనుక 'ఆర్ఆర్ఆర్' సినిమాకు ఏదైనా లింకు ఉందా? అనే కోణంలో అభిమానులు ఆరా తీస్తున్నారు. ఈ సినిమాలో ఫారెస్టుకు సంబంధించిన సీన్స్ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉండటంతో లోకేషన్ కోసమే రాజమౌళి అక్కడి వెళ్లినట్లు టాక్ విన్పిస్తుంది. అయితే ఇటీవల కరోనా బారినపడి రికవరీ అవడం.. షూటింగు వాయిదాతో ఒత్తిడికి గురైనట్లు తెలుస్తోంది. మానసిక ప్రశాంతత కోసం టూర్ వెళ్లినట్లు మరికొందరు ప్రచారం చేస్తున్నారు. 'ఆర్ఆర్ఆర్' సినిమా నిలిచిపోయినా ఏదోఒక అప్డేట్ తో నిత్యం వార్తల్లో నిలుస్తుండటం గమనార్హం.