శ్రీ కృష్ణ క్రియేషన్స్ పతాకంపై ఆదా శర్మ హీరోయిన్గా తెరకెక్కుతున్న చిత్రం క్వశ్చన్ మార్క్(?). విప్రా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను గౌరీకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి పోస్టర్ను తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదశ్ శుక్రవారం లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వల్ల ప్రజలకు ఎంటర్టైన్మెంట్ కరువైన సమయంలో మంచి మెసేజ్తో ఈ చిత్రం రావడం అభినందించదగిన విషయమన్నారు. ఈ సినిమా దర్శక నిర్మాతలతో పాటు యూనిట్ మొత్తానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. నిర్మాత గౌరీ కృష్ణ మాట్లాడుతూ...`కరోనా టైమ్లో ఎవరూ బయటకు రాని సమయంలో హీరోయిన్ ఆదాశర్మ షూటింగ్కు సహకరించారని, యూనిట్ పక్కా ప్లానింగ్తోనే అనుకున్న సమయానికి సినిమా రెడీ అయిందన్నారు. షూటింగ్ సమయంలో కోవిడ్ నిబంధనలను తూచా తప్పకుండా పాటించామన్నారు. తమ సినిమా పోస్టర్ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా లాంచ్ చేయడం ఆనందంగా ఉందన్నారు. త్వరలోనే సినిమాను విడుదల చేస్తామన్నారు.