తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు ఆర్యకు అంబా సముద్రం కోర్టు నోటీసులు జారీ చేసింది. సుమారు 9 ఏళ్ల క్రితం ఆర్య నటించిన సినిమా ‘అవన్ ఇవన్’సినిమాకు సంబంధించిన వివాదం విచారణకు వచ్చింది. ఈ సినిమాలో సింగంపట్టి జమీన్ను అవమానపరిచే సన్నివేశాలు ఉన్నాయంటూ తిరునెల్వేలి అంబా సముద్రం కోర్టులో అప్పట్లో పిటిషన్ దాఖలైంది. దాంతో ఆర్యకు అంబా సముద్రం కోర్టు నోటీసులు జారీ చేసింది. సినిమాలో హిందూ దేవుళ్లు, సోరిముత్తు అయ్యనార్, సింగంపట్టి జమిందార్లను కించపరిచే సన్నివేశాలు ఉన్నాయని ఆరోపిస్తూ దర్శకుడు బాల, ఆర్యలపై పిటిషనర్ అప్పట్లో కోర్టుకెక్కాడు. శుక్రవారం ఈ పిటిషన్ను విచారించిన కోర్టు ఈ నెల 28న తమ ఎదుట హాజరు కావాలంటూ ఆర్యకు నోటీసులు జారీ చేసింది. అవన్ ఇవన్ సినిమాకు బాల దర్శకత్వం వహించగా, విశాల్, ఆర్య ప్రధాన పాత్రల్లో నటించారు. అయితే ఈ కేసును కొట్టివేయాలంటూ 2018లో మద్రాస్ హైకోర్టులోని మదురై బెంచ్ను నటుడు ఆర్య ఆశ్రయించాడు. తాజాగా కోర్టు నోటీసులు ఇవ్వడంతో ఈ వివాదం ఏ మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.