సూపర్స్టార్ రజినీకాంత్ ఫ్యాన్స్కు నటుడు, కొరియోగ్రాఫర్, దర్శకుడు రాఘవ లారెన్స్ సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పాడు. రజినీకాత్ వీరాభిమానుల్లో లారెన్స్ ఒకడు. అలాంటి లారెన్స్ .. తోటి తలైవా ఫ్యాన్స్కు ఎందుకు సారీ చెప్పాడు... అనే విషయాలను చూస్తే...సూపర్స్టార్ రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీ గురించి అనుకున్నప్పుడు ఆయనకు ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయి. దాంతో రజినీకాంత్ రాజకీయాల్లోకి రావడం లేదంటూ చెప్పేశాడు. దీనిపై నిరాశ చెందిన తలైవర్ ఫ్యాన్స్ రీసెంట్గా ఆయన నిర్ణయం మార్చుకోవాలంటూ చెన్నైలో ఆందోళన చేశారు. చివరకు ఈ ఆందోళనపై కూడా రజినీకాంత్ స్పందించారు. తాను ఇది వరకే రాజకీయాల్లోకి ఎందు రావాలనుకోవడం లేదనే దానిపై వివరణ ఇచ్చానని, అలాంటప్పుడు మళ్లీ ఆందోళనలు చేసి తనను రాజకీయాల్లోకి రావాలంటూ ఇబ్బంది పెట్టకండి అంటూ మరోసారి ఫ్యాన్స్కు విన్నవించుకున్నాడు. నిజానికి చెన్నైలో రజనీ మక్కల్ మండ్రం ఆందోళన చేయడానికి ముందు ఆయన అభిమానులందరూ రావాలంటూ పిలుపులు వెళ్లాయి.
చాలా మంది ఆందోళనకు సంబంధించిన మీటింగ్లో పాల్గొనలేదు. అలా అభిమాని అయినప్పటికీ రజనీ మక్కల్ మండ్రం సమావేశానికి వెళ్లని వారిలో రాఘవ లారెన్స్ కూడా ఉన్నాడు. దీనిపై లారెన్స్ వివరణ ఇచ్చుకున్నాడు. "నిజానికి నేను రజినీ మక్కల్ మండ్రం మీటింగ్కు రానందుకు క్షమించండి. నేను అలా రాకపోవడానికి కారణముంది. చాలా మంది నాకు ఫోన్ చేసి ఎందుకు రాలేదంటూ అడుగుతున్నారు. అలాగే తలైవర్ను నిర్ణయం మార్చుకోవాలంటూ నేను సూచించాలని కూడా అంటున్నారు. అయితే అందరికీ నేను చెప్పేదొక్కటే. నిజానికి మన నాయకుడు మరేదైనా కారణం చెప్పి ఉంటే నేను ఆయన్ని రిక్వెస్ట్ చేసేవాడిని. కానీ.. ఆయన ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పినప్పుడు ఆయన్ని మనం రిక్వెస్ట్ చేసి, ఆయనేమైనా నిర్ణయం మార్చుకుని రాజకీయాల్లోకి వచ్చాడనుకోండి. ఆయనకు జరగరానిదేదైనా జరిగితే జీవితాంతం మనం అందరం బాధపడుతూ ఉండాలి. రాజకీయాల్లోకి రాకపోయినా ఆయన నాకు గురువే. ఆయనకు సన్నిహితుడైన వ్యక్తిగా ఆరోగ్య పరిస్థితి గురించి అవగాహన ఉంది. ఇప్పుడు మనమందరం ఆయన ఆరోగ్యం కోసం ప్రార్థించాల్సిన అవసరం ఉంది. ఆయన కోసం నా ప్రార్థనలు ఎల్లప్పుడూ ఉంటాయి" అన్నారు రాఘవ లారెన్స్.