ఉప్పెన మూవీ మంచి హిట్ టాక్ సంపాదించుకుంది. విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది. వసూళ్లలో రికార్డులు సృష్టిస్తోంది. ఉప్పెన మూవీ సినిమా చూసిన పలువురు నటులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా హీరో మహేశ్ బాబు ఉప్పెన మూవీ చూసి ఆసక్తికరంగా స్పందించారు. ఈ చిత్రంపై ట్విట్టర్ లో తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఉప్పెన గురించి ఒక్కమాటలో చెప్పాలంటే "క్లాసిక్" అంటూ కొనియాడారు.
మరోవైపు మూవీ దర్శకుడు బుచ్చిబాబుపై ప్రశంసల వర్షం కురిపించారు. "బుచ్చిబాబు సానా... మీరు తీసిన చిత్రం అత్యంత అరుదైనది. కలకాలం నిలిచే చిత్రాల్లో ఒకటిగా నిలిచిపోతుంది. మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది. ఇక ఉప్పెన చిత్రానికి గుండెకాయ అంటే దేవిశ్రీప్రసాద్ అనే చెప్పాలి. ఆల్ టైమ్ గ్రేట్ సంగీతాల్లో ఒకటిగా ఉప్పెన పాటలు, నేపథ్య సంగీతం నిలిచిపోతాయి. డీఎస్పీ... మీరు ఇప్పటివరకు చేసిన అన్ని చిత్రాల్లో ఇదే అత్యుత్తమం.
మీరు ఇదే ఒరవడి కొనసాగించాలి అంటూ ఆకాంక్షించారు. ఇకపోతే హీరోహీరోయిన్లు వైష్ణవ్ తేజ్, కృతిశెట్టిలను మహేశ్ ఆకాశానికెత్తేశాడు. "ఇద్దరూ కొత్తవాళ్లు అయినా కళ్లు చెదిరేలా నటించారు. మీరిద్దరూ ఇక స్టార్లే!" అంటూ ప్రశంసించారు. చివరగా సుకుమార్ కు, మైత్రీ మూవీ మేకర్స్ కు హ్యాట్సాఫ్ చెప్పాలి. ఉప్పెన వంటి ప్రాజెక్టుకు మద్దతుగా నిలిచారు. నేను చెప్పినట్టుగా ఉప్పెన సినీ చరిత్రలో కలకాలం నిలిచే చిత్రంగా నిలిచిపోతుందని హీరో మహేశ్ బాబు పేర్కొన్నారు.