రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ హీరో జాన్ అబ్రహంతో కలిసి ‘ఎటాక్’ సినిమా చేస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇటీవల ఉత్తర్ ప్రదేశ్లోని ధనిపూర్ లో ప్రారంభమైంది. అక్కడ కొన్ని యాక్షన్ సీన్స్, బాంబ్ బ్లాస్ట్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు. అయితే సినిమా షూటింగ్ జరుగుతుండగా అక్కడి స్థానికులు రాళ్లదాడి చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
తమ సమీపంలోనే సినిమా షూటింగ్ జరుగుతోందని తెలిసిన స్థానికులు వారిని చూడడానికి వచ్చారు. కానీ షూటింగ్ స్పాట్ వద్ద గేటు మూసివేయడంతో సెట్ గోడ ఎక్కి షూటింగ్ చూడటానికి జనం ప్రయత్నించారు. ఈ క్రమంలోనే సెక్యూరిటీ సిబ్బందికి, స్థానికులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో ప్రజలు రాళ్లదాడికి పాల్పడ్డారు. వెంటనే పోలీసులు వచ్చి ఇరువర్గాలను చెదరగొట్టడంతో పరిస్థితి సద్దుమణిగింది. కాగా ఈ ఘటనలో చిత్రయూనిట్ కు ఎలాంటి గాయాలు కాలేదు.